Cyber Crime | సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజల నుంచి రూ.1.66 కోట్లు వసూలు చేసి, మోసగించిన నిందితుడిని సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ కథనం ప్రకారం.. కర్ణాటక ప్రాంతానికి చెందిన కుంజత్బెయిల్ ముజీబ్ సయ్యద్ ‘మ్యాక్స్ క్రిప్టో ట్రేడింగ్’ పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న తన అనుచరులతో కలిసి ఆన్లైన్ ద్వారా తన సంస్థలో పెట్టుబడులు పెడితే, పెట్టుబడి పెట్టిన 150 రోజుల్లోనే పెట్టిన డబ్బుపై మూడు రెట్లు రిటర్న్స్ ఇస్తానని నమ్మించాడు. అమాయక ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. అంతేకాకుండా.. కొత్త వారితో పెట్టుబడి పెట్టించిన వారికి 2 శాతం, ఇద్దరు సభ్యులతో పెట్టుబడి పెట్టిస్తే 5 శాతం చొప్పున కమీషన్ కూడా చెల్లిస్తానంటూ నమ్మబలికాడు. ఈ క్రమంలో షాద్నగర్కు చెందిన షేక్ అహ్మద్తో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో 51 మంది బాధితులు, నగరానికి చెందిన మరికొంత మంది బాధితులు దాదాపు రూ.1.66 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. మొదట్లో కొంత మేర రిటర్న్స్ చెల్లించిన నిందితుడు.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చిన వెంటనే తన వెబ్సైట్ను మూసివేశాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఈఓడబ్ల్యూ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, గురువారం రిమాండ్కు
తరలించారు.
తక్కువ కాలంలోనే ఎక్కువ రాబడి అంటూ గుర్తు తెలియని వ్యక్తులు చెబుతున్న మాటలు నమ్మవద్దని, కొత్తగా పుట్టుకొచ్చిన సంస్థల్లో పెట్టుబడి పెడితే మొదటికే మోసమని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలతో పాటు ఆర్థిక నేరాలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.