కాలం మారినప్పుడు ముందుగా ఆ ప్రభావం చర్మంపైనే పడుతుంది. వాతావరణ మార్పులతో చర్మం పొడిబారిపోవడం, మొటిమలు, మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. వర్షకాలంలో జిడ్డు చర్మం ఉన్నవారు ఈ సమస్యల్ని ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. జిడ్డుతోపాటు చర్మంలో తేమ ఎక్కువగా ఉంటే చికాకులు తప్పవు. తేమ పెరగడం వల్ల చర్మం రంగు మారుతుంది. ఈ ప్యాక్స్ వేసుకోవడం వల్ల వానల్లో మెరుపులా మెరిసిపోవచ్చు..
కీరాలో మన శరీరానికి మేలుచేసే గుణాలు చాలా ఉంటాయి. కీరదోస రసాన్ని ముఖానికి అప్లయ్ చేస్తే.. జిడ్డు మాయమవుతుంది. దీనిని టోనర్లా కూడా వాడొచ్చు. కీరాని మిక్సీలోగానీ, బ్లెండర్లోగానీ వేసి గ్రైండ్ చేసి చర్మానికి బాగా పట్టించి.. 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి.
పుదీనాలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. ఇది చర్మానికి కొత్త నిగారింపును ఇస్తుంది. కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకుని పేస్టు చేసుకోవాలి. అందులో ముల్తానీ మట్టి, తేనె, పెరుగు వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి అప్లయ్ చేసి ఆరిన తర్వాత కడిగేయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.
అనేక చర్మ సమస్యలకు వేపాకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. రెండు స్పూన్ల ముల్తానీ మట్టి, రెండు స్పూన్ల వేపాకు రసం, రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ఫేస్ ప్యాక్లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే జిడ్డు తగ్గి ముఖం అందంగా మెరిసిపోతుంది.