మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి విటమిన్ బి12 కీలకంగా నిలుస్తుంది. డీఎన్ఏ సంశ్లేషణకు, శక్తి ఉత్పత్తికి, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి విటమిన్ బి12 అత్యవసరం. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి, ఒత్తిడి నుంచి ఉపశమనానికి, శరీరంలో శక్తి స్థాయుల పెరుగుదలకు, చర్మ ఆరోగ్యానికి కూడా ఈ విటమిన్ ఎంతో అవసరం. అంతేకాదు ఇది మన మూడ్ను మెరుగుపరుస్తుంది. ఒకవేళ ఈ విటమిన్ లోపిస్తే అలసట, మూడ్లో చికాకులు, వెంట్రుకలు, గోళ్ల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, రోజువారీ ఆహారంలో తగిన మోతాదులో విటమిన్ బి12 ఉండేలా చూసుకోవాలి. మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో ఇది సమృద్ధిగా లభిస్తుంది.
వివిధ రకాలైన వైద్య ప్రక్రియలు, అత్యవసర పరిస్థితుల్లో, అవసరంలో ఉన్న రోగులకు రక్తం చాలా అవసరం. రక్తదానం వల్ల ప్రమాదాలు, సర్జరీలు, క్యాన్సర్ చికిత్స, దీర్ఘకాలిక రోగాలు, బలమైన గాయాలు తగిలిన వాళ్లకు ప్రాణదాతలుగా మారవచ్చు. మనిషి రక్తానికి ప్రత్యామ్నాయం మరొకటి లేదు కాబట్టి, రక్తదానం అవసరంలో ఉన్నవాళ్లకు రక్త సరఫరాకు హామీ ఇస్తుంది. ఒకరి రక్తదానంతో ముగ్గురి జీవితాలను నిలబెట్టవచ్చు. పైగా రక్తదాతలు దానం సమయంలో తమ ఆరోగ్యం వివరాలను కొంతమేరకు తెలుసుకోగలుగుతారు. ఇంకా సమాజానికి తమవంతు మేలు చేశామన్న తృప్తి మిగులుతుంది.
గాలి కాలుష్యం కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజుకు దాదాపు రెండువేల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారట. అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ వెల్లడించిన నివేదిక ప్రకారం 2021లో గాలి కాలుష్యం కాటువల్ల ఎనభై ఒక్క లక్షల మంది మరణించారు. రక్తపోటు (బీపీ) తర్వాత ఆయువు తీరకముందే మనుషుల ఉసురు తీస్తున్న ముప్పు కారకాల్లో గాలి కాలుష్యం రెండో స్థానంలో ఉంది. 2021లో గాలి కాలుష్యం ఏడు లక్షలకు పైగా ఐదేండ్లలోపు చిన్నారుల ఆయువు తోడేసిందని నివేదిక తెలిపింది. వీరిలో ఐదు లక్షల మరణాలకు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇంట్లో బొగ్గు, కర్రలు, పేడ మండించగా వచ్చిన పొగే కారణమట. గాలి కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యల ముప్పునూ పెంచుతుంది. అందువల్ల రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలికి భరోసానివ్వాలి.