పురుషుల్లో 53% మందిలో, మహిళల్లో 56% మందిలో ప్రతిరక్షకాలు ఉన్నాయి.
70 ఏండ్లకు పైబడినవారిలో 49 శాతంమంది మాత్రమే వ్యాధి బారిన పడ్డారు.
కరోనా సోకినవారి కుటుంబసభ్యుల్లో 78 శాతం మందిలో ప్రతిరక్షకాలు.
కరోనా రోగులకు తెలిసినవారిలో 68% మందిలో యాంటీబాడీస్.
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 4: హైదరాబాద్ మహానగరంలో 54శాతం మందికి కొవిడ్-19 వచ్చిపోయినట్టు తాజా అధ్యయనంలో తేలింది. వీరిలో చాలామందికి కరోనా తమకు సోకిన విషయం కూడా తెలియదని అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తలు చెప్పారు. సీఎస్ఐఆర్ – సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), భారత్ బయోటెక్ సంస్థలు సంయుక్తంగా నగరంలో నిర్వహించిన సర్వేలో 54శాతం మందిలో కరోనా ప్రతిరక్షకాలు ఉన్నట్టు తేలింది. సీసీఎంబీలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా సర్వే వివరాలను వెల్లడించారు. నగరం నలుమూలల 150 డివిజన్లలోని 30 వార్డుల్లో తొమ్మిది వేలమంది నుంచి నమూనాలు సేకరించి సర్వే నిర్వహించారు. ఒక్కో వార్డులో 300 మంది సర్వేలో పాల్గొన్నారు. పదేండ్ల వయసు నుంచి తొంభై ఏండ్లలోపు వయసువారిపై నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు అన్ని డివిజన్లలో ఒకేస్థాయి ప్రతిరక్షకాలు ఉన్నట్టు తేలింది.
సర్వేలో పురుషుల్లో 53 శాతం మందికి ప్రతిరక్షకాలు బయటపడగా, స్త్రీలలో 56 శాతం మందిలో ఉన్నట్టు తేలింది. 70 ఏండ్లకు పైబడినవారిలో 49 శాతంమంది మాత్రమే వ్యాధి బారిన పడినట్టు తేలింది. కరోనా వ్యాధి సోకినవారి కుటుంబసభ్యులలో ప్రతిరక్షకాలు 78 శాతం మందిలో బయటపడగా, కరోనా రోగులకు తెలిసినవారిలో 68 శాతంమందిలో ప్రతిరక్షకాలు బహిర్గతమయ్యాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 75 శాతం మందికి తమకు కరోనా సోకిన విషయమే తెలిదని రాకేశ్మిశ్రా తెలిపారు. కరోనా ఎంత నిశ్శబ్దంగా వ్యాపిస్తుందనేదానికి ఇదే నిదర్శనమన్నారు. హైదరాబాద్ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా పయనిస్తున్నట్లు సర్వే ఫలితాలు స్పష్టంచేస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్తో ఇది మరింత వేగం పుంజుకొంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతిరక్షకాలు ఉన్నప్పటికీ వ్యాక్సిన్ వేసుకోవడమే మేలని సూచించారు. సమావేశంలో సీసీఎంబీలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో డాక్టర్ ఎన్ మధుసూదన్రావు, ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ లక్ష్మయ్య, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వీ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.