నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) చుట్టూ ముసురుకున్న వివాదం మన దేశంలో డాక్టర్ కావాలని కలలుగనే విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో ఒక భాగం మాత్రమే. అత్యంత విలువైన వైద్య సీటు పొందడం దగ్గర నుంచి వారు వైద్య విద్యను పూర్తిచేసేంత వరకు ఎదుర్కొనే ఆర్థికపరమైన సవాళ్ల గురించి చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం.
MBBS | భారత్లో వైద్యుడు-జనాభా నిష్పత్తి 0.9:1000గా ఉన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు 1:1000కు ఇది దగ్గరగా ఉన్నది. అయినప్పటికీ భారత్లో డాక్టర్ కావాలనుకునేవారి ప్రయాణం అడ్డంకులతో కూడుకున్నదే. దేశంలో లక్షకు పైగా వైద్య విద్య (ఎంబీబీఎస్) సీట్లు ఉండగా.. వాటి కోసం ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు. అదీకాకుండా మొత్తం సీట్లలో ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లు సగమే కావడం గమనార్హం. అయితే వీటిలోనూ చాలా సీట్లను వివిధ కోటాల రూపంలో కేటాయిస్తారు. దీంతో అర్హత ఉన్న అనేకమంది విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారు.
ఈ క్రమంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన అంశం ఎంతో భయానకంగా ఉంటుంది. దేశంలోని అనేక ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మొత్తం కోర్సు ఫీజు రూ.కోటి వరకు ఉంటుంది. ఈ అంశం పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల వైపు కన్నెత్తి చూసే అవకాశం లేకుండా చేస్తున్నది.
నీట్ విషయంలో రాజుకున్న కొత్త వివాదం జాతీయ అర్హత పరీక్షల నిర్వహణ పట్ల అధికారుల సామర్థ్యాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు విలువైన సమయం, ఇతర వనరులను కేటాయించిన లక్షల మంది విద్యార్థులపై ఈ వివాదం తీవ్ర ప్రభావం చూపుతున్నది.
భారత్లో తెల్ల కోటు, స్టెతస్కోప్ను వేసుకోవాలనే కల ఎంతో ఖర్చుతో కూడుకున్నది. డాక్టర్ కావాలనుకునేవారికి అంకితభావం మాత్రమే ఉంటే సరిపోదు, గణనీయమైన ఆర్థిక పెట్టుబడులు కూడా అవసరం. ఈ ప్రయాణం కోచింగ్ ఖర్చులతో ప్రారంభమవుతుంది. ఆకాశ్, అలెన్, విద్యామందిర్.. ఇలా ఇన్స్టిట్యూట్ను బట్టి కోచింగ్ ఫీజు రూ.1.2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. ప్రాంతం, ఇన్స్టిట్యూట్ ఎంపిక, అక్కడి వసతులు, బోధన సిబ్బంది నైపుణ్యం తదితర అంశాలు కోచింగ్ ఫీజును ప్రభావితం చేస్తాయి.
భారత్లో మొత్తం 600కు పైగా వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ కోర్సును అందిస్తున్నాయి. అయినప్పటికీ వైద్య విద్యకు పోటీ తీవ్రంగానే ఉన్నది. 2024లో నీట్-యూజీ పరీక్షకు 23 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అత్యధికులు తక్కువగా ఉండే ప్రభుత్వ మెడికల్ సీట్లపైనే గురిపెట్టారు. ఫీజుల్లో రాయితీలిచ్చే ప్రభుత్వ కళాశాలలు దేశవ్యాప్తంగా 386 మాత్రమే ఉండగా.. వాటిలో 55,095 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ లెక్కన ఒక్కో సీటు కోసం సుమారుగా 42 మంది పోటీ పడుతున్నారు. అయితే దేశంలోని మొత్తం 320 ప్రైవేట్ కళాశాలల్లో 53,625 సీట్లున్నాయి. కానీ, వాటిలో ఉండే అధిక ఫీజుల కారణంగా అవి చాలామందికి అందుబాటులో లేకుండాపోతున్నాయి.
ప్రభుత్వ కళాశాలలు చాలా తక్కువగా ఏడాదికి రూ.5 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఫీజులను వసూలు చేస్తాయి. వసతులు, పేరుప్రఖ్యాతులను బట్టి ప్రైవేట్ కళాశాలలు ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తాయి. ఒడిశాలో ఉన్న కళింగ మెడికల్ కళాశాలలోని ఓ విద్యార్థి తాను ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘నేను కళాశాలలో చేరినప్పుడు ఏడాది ట్యూషన్ ఫీజు రూ.12 లక్షలు మాత్రమే. కానీ, ఇప్పుడు అది రూ.16 లక్షలు. ఇతర ఖర్చులు అదనం. ఐదేండ్ల కోర్సు పూర్తయ్యే సరికి విద్యార్థుల తల్లిదండ్రులు రూ.80 లక్షల వరకు కట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు అది రూ.కోటికి పైనే ఉండొచ్చు’ అని అతను పేర్కొన్నారు.
మౌలిక వసతులు, ఫ్యాకల్టీ నైపుణ్యాలను కారణంగా చూపుతూ తమ కళాశాలల్లో ఉండే భారీ ఫీజులను ప్రైవేట్ కళాశాలలు సమర్థించుకుంటున్నాయి. అయితే దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతున్నది. అదే సమయంలో ప్రభుత్వ కళాశాలలు అతి తక్కువ ఫీజులే వసూలు చేస్తూ వైద్య విద్యను ప్రోత్సహిస్తున్నాయి.
దేశంలో పెరుగుతున్న వైద్య విద్య ఫీజులు మన విద్యార్థులు ప్రత్యామ్నాయంగా విదేశాల వైపు చూసేలా చేస్తున్నది. రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ తదితర దేశాలు చాలా తక్కువ మొత్తానికే వైద్య విద్యను అందిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం.. విదేశాల్లో వైద్య విద్య అభ్యసిస్తున్న మన విద్యార్థుల సంఖ్య 2015లో 3438 ఉండగా.. 2019 నాటికి 12,321కి చేరుకున్నది. బంగ్లాదేశ్లో వైద్య విద్యకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చవుతుంది. ఫిలిప్పీన్స్లో రూ.35 లక్షలు మాత్రమే. అదే రష్యాలో అయితే హాస్టల్ ఖర్చులతో సహా కలిపి రూ.20 లక్షల్లోనే మెడిసిన్ పూర్తి చేసుకోవచ్చు. మన దేశంలో ఇదే విధంగా వైద్య విద్య ఖర్చులు క్రమంగా పెరుగుతూపోతే.. తమ కలను నిజం చేసుకునేందుకు అర్హులైన అనేకమంది విద్యార్థులు విదేశాల బాటపట్టడం ఖాయం.
(‘బిజినెస్ టుడే’ సౌజన్యంతో)
మణిపూర్ అల్లర్లను అదుపు చేయడంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగా ప్రజలు నాపై కోపంతో ఉన్నారని తెలుసు. అది నేను అంగీకరిస్తా. పరిస్థితి సంక్లిష్టంగానే ఉన్నది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా కొనసాగాలా? పదవికి రాజీనామా చేయాలా? అనేది నా చేతుల్లో లేదు.
– బీరేన్సింగ్, మణిపూర్ ముఖ్యమంత్రి
– సోనాలి