ఆర్థికంగా వెనుకబడిన రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన పథకం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’. అర్హులైన అనేకమంది రైతులకు ఈ పథకం అందడం లేదు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి కొత్త లబ్ధిదారులను చేర్చకపోవడంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పెట్టుబడి సాయాన్ని అందుకోలేకపోతున్నా రు. రైతులకు సంబంధించిన పథకం కాబట్టి లబ్ధిదారుల ఎంపికను నిరంతర ప్రక్రియగా చేపట్టాలె. అప్పుడే అర్హులందరికీ ప్రయోజనం చేకూరుతుంది.
‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథక రూపకల్పన సమయంలో 2018 కంటే ముందు పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులు మాత్రమే అర్హులుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు వారికే పెట్టుబడి సాయం అందుతున్నది. 2018 తర్వాత నమోదైనవారికి ఆ పథకం కింద పెట్టుబడి సాయం అందటం లేదు. కాబట్టి ఈ పథకానికి అర్హులైన రైతులను లబ్ధిదారుల జాబితాలో చేర్చాలి. అంతేకాకుండా, ఏడాదికి రూ.6000గా ఉన్న సాయాన్ని రూ.10 వేలకు పెంచాలి. సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడి సాయాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– గుండమల్ల సతీష్ కుమార్