రామాయణ మహా కావ్యాన్ని రచించి ఈ ప్రపంచానికి కుటుంబ వ్యవస్థను పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి. వాల్మీకి బోయలు ఆయనను జాతి దైవంగా, మూల పురుషుడిగా పూజిస్తారు. భారతదేశంలోని జంతు వేటను ప్రధాన వృత్తిగా కలిగి ఉన్న ఆటవిక తెగల్లో వాల్మీకిబోయ ఒకటి. బోయలను కన్నడ భాషలో ‘బేడర’ అని, తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో ‘వేదన్’ అని పిలుస్తారు.
దేశంలో చాలా రాష్ర్టాల్లో షెడ్యూల్డ్ ట్రైబల్స్గా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని కొన్ని జిల్లాల్లో గిరిజన తెగలుగా.. మరికొన్ని జిల్లాలో బీసీ-ఏలుగా పరిగణిస్తున్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1968 వరకు వీళ్లను అడవుల్లోంచి వచ్చిన ట్రైబ్లుగా, ఎస్టీలుగా గుర్తించింది. ఆ తర్వాత రాజకీయ కారణాలతో గిరిజన జాబితా నుంచి తొలగించారు. కొన్ని ప్రాంతాల్లో వీరిని వాల్మీకి, తలారి, కావలి, కిరాత, నిషాద, గురికార, పెద్దబోయ, చిన్నబోయ, యల్లాపి, నాయకర్ అని పలురకాల పేర్లతో పిలుస్తారు.
భారత రాజ్యాంగ చట్టం 1951 జి.ఓ.ఎం. ఎన్ 1527/1951 ప్రకారం వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించింది. 1968 వరకు బోయలు ఎస్టీలోనే కొనసాగారు. ఉమ్మడి ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో వాల్మీకి బోయల జనాభా ఎక్కువ. దీనివల్ల ఆధిపత్య కులాలవారు బోయ లు ఎస్టీలుగా ఉంటే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందిగా మారుతారని కుట్రలు పన్నారు. దీం తో అప్పటి నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం బోయలకున్న ఎస్టీ రిజర్వేషన్ను రద్దు చేసి బీసీ-ఏజాబితాలో చేర్చింది. దీంతో వారికి తీరని అన్యా యం జరిగింది. అప్పటి నుంచి దశాబ్దాలుగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉద్యమిస్తూనే ఉన్నారు. ప్రపంచీకరణ వల్ల బోయలు అడవులను వదిలి మైదాన ప్రాంతాలకు వచ్చి స్థిరపడ్డారు. కులవృత్తి లేని బోయలకు సమాజంలో సరైన గుర్తింపు లభించక ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధిరంగాల్లో వెనుకబాటుకు గురయ్యారు. వాల్మీకి బోయల ఉద్యమాలను గుర్తించిన నాటి ఉద్యమనాయకుడు. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారిది న్యాయపరమైన డిమాండ్గా పరిగణించారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నారు. అన్నట్టుగానే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఆ తర్వాతనే గిరిజన రిజర్వేషన్లు పెంచేందుకు, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సమగ్రమైన నివేదికను అందించాలని ప్రభుత్వం చెల్లప్ప కమిషన్ను ఏర్పాటుచేసింది. తర్వాత చెల్లప్ప కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వాల్మీకి బోయల జీవనవిధానం, స్థితిగతులు, ఆచార వ్యవహారాలను అధ్యయనం చేసి వాల్మీకి బోయలు అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురై కులవృత్తి లేక దుర్భరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారని వాల్మీకిబోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వానికి రిపోర్ట్ను అందించింది.
రాష్ట్ర ప్రభుత్వం 2017లో అసెంబ్లీలో వాల్మీకిబోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఎల్.ఎ. బిల్.నెం.6/2017ను తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ కేంద్రం బిల్లును పెండింగ్లో పెట్టింది. వాల్మీకి బోయల బాధను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరోసారి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. ఇప్పటికైనా కేంద్రం వాల్మీకి బోయల సమస్యల పట్ల స్పందించాలి. కాలయాపన చేయకుండా వారిని ఎస్టీ జాబితాలో చేర్చి తగిన న్యాయం చేయాలి. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల కోసం లక్షల మంది వాల్మీకిబోయలు ఆశతో ఎదురుచూస్తున్నారు.
మీనుగు రఘుపతి: 95538 08855
(వ్యాసకర్త: బోయ హక్కుల పోరాట సమితి)