నాడు సేవగా భావించిన వైద్యం నేడు వ్యాపారంగా మారింది. ఫలితంగా వైద్య విద్యలో నాణ్యత కొరవడింది. వ్యాపారమే పరమావధిగా భావించే ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో వైద్య విద్య పెద్దల విద్యగా మారిపోయింది. దీనికి తోడు జాతీయ స్థాయిలో ఎన్టీఏ నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ కారణంగా వైద్య విద్య పేదలకు అందని ద్రాక్షే అయింది.
ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటు ఇతర వైద్య విద్య కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో రోజురోజుకు నమ్మకం సన్నగిల్లుతున్నది. ఎన్టీఏ తీరుపై, విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నీట్లో ఏటా ఇద్దరు లేదా ముగ్గురు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తుండగా.. ఈ సారి ఏకంగా 67 మంది టాపర్లుగా నిలవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కొన్ని రాష్ర్టాల్లో పేలవ నిర్వహణ, ప్రభుత్వాల నిర్లక్ష్యం, పేపర్ లీకేజీలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
మే 5న జరిగిన నీట్ పెద్ద స్కాం అంటూ ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. అయితే సరిగ్గా పరీక్షకు రెండు రోజుల ముందు ‘నీట్ చీటింగ్ స్కాం’ బయటకు వచ్చింది. గుజరాత్కు చెందిన కొంతమంది విద్యార్థులకు ఉత్తీర్ణత సాధించేలా చేస్తామని హామీ ఇచ్చిన ఓ విదేశీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల చొప్పున వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. బీహార్లో ఒక్కొక్కరి నుంచి రూ.20-30 లక్షల చొప్పున వసూలు చేశారనే ఆరోపణలపై పరీక్షకు ముందు రోజు కొందరిని అరెస్టు చేయడం కలకలం రేపింది. మరోవైపు పరీక్ష రోజు ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రాజస్థాన్లోని ఓ పరీక్షా కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులకు పొరపాటున ఆంగ్ల మీడియం ప్రశ్నాపత్రం ఇచ్చారని, పొరపాటును గుర్తించేలోపే 100 మందికి పైగా ప్రశ్నాపత్రాలతో సహా బయటకు వెళ్లిపోయారని, సాయంత్రం 4 గంటల తర్వాతే సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం షేర్ అయిందని ఎన్టీఏ అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. అప్పటికే దేశంలోని అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రారంభమైందని, అందువల్ల పేపర్ లీక్ కాలేదని వారు స్పష్టత ఇచ్చారు. కాగా, తెలంగాణలోని కుమ్రం భీం జిల్లాలోనూ ప్రశ్నాపత్రం తారుమారైంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నాపత్రం కాకుండా ఇక్కడ వేరే పేపర్ ఇచ్చారు. ఎన్నో అవకతవకలు జరిగాయి కాబట్టి ఫలితాలను వాయిదా వేయాలి.
నీట్పై ఆరోపణలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. 2021లో పేపర్ లీక్ ఆరోపణలపై రాజస్థాన్లో 16 మంది అరెస్ట్ అయ్యారు. మహారాష్ట్రలో ఓ కేంద్రంలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినట్టు సీబీఐ తేల్చింది. ఇలా అక్రమాలకు పాల్పడి సీట్లు పొందుతున్నవారంతా ధనవంతుల పిల్లలే. వారంతా అడ్డదారుల్లో ర్యాంకులు తెచ్చుకొని ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. దీంతో పేద విద్యార్థులు అప్పోసప్పో చేసి లక్షల రూపాయలు కుమ్మరించి ప్రైవేట్ కళాశాలల్లో చదవాల్సిన దుస్థితి దాపురించింది. నీట్ నిర్వహణలో మంత్రుల జోక్యం కారణంగా ఎన్టీఏ స్వయం ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారుతున్నది. అక్రమాలకు అడ్డాగా మారిన ఎన్టీఏను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. సమానత్వం, సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ ఎంతో మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న ఈ పరీక్షను నిలిపివేయడమే శ్రేయస్కరం.
– బి.వీరభద్రం
94929 30835