Telangana | పాలకులెవరైనా తెలంగాణ ఆత్మగౌరవానికి క్షతి రాకూడదు. దశాబ్దాల పాటు అవమానాలపాలై తాడోపేడో తేల్చుకొనేలా కొట్లాడి, త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ పచ్చి అవకాశవాద రాజకీయ నేతల బారినపడి అస్తిత్వాన్ని కోల్పోకూడదు. స్వరాష్ట్రమంటే ఒక్క పాలనే కాదు, అడుగడుగునా తెలంగాణ భాష, సంస్కృతి, జీవన సరళి, జాతిగౌరవాలను నిలబెట్టుకోవడం. ఉమ్మడి పాలనలో తమ భాషను గేలి చేశారని ప్రజలు బాధపడ్డారు. బతుకమ్మను పట్టించుకోలేదని కలతచెందారు. ఇక సహించలేమని తెగించి, కొట్లాడి తెలంగాణను సాధించుకున్నారు.
స్వరాష్ట్రం సిద్ధించిన పదేండ్ల తర్వాత పాలనా పగ్గాలు కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాల అమల్లో కొన్ని లోటుపాట్లు జరిగినందుకే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని పరిశీలకుల ఉవాచ. అలవికాని హామీలను ఆశ చూపి, జనాన్ని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారనేది కేసీఆర్ మాట. ఎవరి మాట ఎలా ఉన్నా.. ప్రజల ఓట్లే పాలనను నిర్ణయిస్తాయి. అయితే పాలనతో పాటు తెలంగాణ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్నది. గత పదేండ్లలో తెలంగాణ కళలు, సాహిత్యం, సంస్కృతులకు తగిన ప్రాధాన్యం దక్కింది. ఈ విషయంలో కాంగ్రెస్ ఎంతో వెనుకబడి ఉంది. తెలంగాణ ప్రజలు ప్రాణప్రదంగా భావించే వీటి పట్ల ఆసక్తి, అవగాహన ఉన్ననాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరనే చెప్పాలి.
అందుకే తెలంగాణ గీతం ప్రకటించినప్పటికీ.. దానికి సినిమావాళ్లతో బాణీలు కట్టించడం వల్ల స్థానికత తగ్గి, శాస్త్రీయం పెరిగిందని విమర్శలు వచ్చాయి. ‘నాకేం తెలియదు.. అందెశ్రీయే ఆయనను కావాలన్నారు’ అని సీఎం రేవంత్రెడ్డి చేతులు దులిపేసుకున్నారు. రాజకీయ ఎత్తుగడే తప్ప ‘గీతం ఎలా ఉంటే బాగుంటుంది’ అనే శ్రద్ధ ఆయన మాటల్లో కనిపించలేదు. రాష్ట్ర చిహ్నం మార్పు అంశమూ వివాదాస్పదమైంది. కాకతీయ తోరణం, చార్మినార్లను తొలగించాలన్న ఆలోచన రసాభాసగా మారింది. చారిత్రక ఆనవాళ్లను రాచరిక చిహ్నాలంటూ సీఎం పేర్కొనడంపై పెద్ద చర్చే జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహంలోనూ రేవంత్రెడ్డి వంకలు తీశారు. అయితే ప్రభుత్వం చేపట్టిన మార్పులు ఒక కొలిక్కి రాకపోవడంతో అది త్వరగానే సద్దుమణిగింది. నేలపై నిజమైన ప్రేమానురాగాలు, చారిత్రిక పరిజ్ఞానం ఉంటే తప్ప చిహ్నాలు ఎలా ఉండాలో తీర్మానించుకోలేరు.
సంస్కృతిపరంగానే కాకుండా తెలంగాణ ఉనికిని, స్వరాష్ట్ర పరమార్థాన్ని కోల్పోయే ప్రమాదాలు కూడా ప్రస్తుత పాలనలో పొడచూపుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో సగం మందికి పైగా ఇతర పార్టీల నుంచి వచ్చినవారే. పది మంది దాకా పార్టీ పాతకాపులు ఉండవచ్చు. అయితే క్రమంగా వారికి కూడా గౌరవం తగ్గుతున్నది. నిఖార్సయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డికి ఏ మాత్రం సమాచారం లేకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.సంజయ్కుమార్ను కాంగ్రెస్లోకి రేవంత్ తీసుకోవడం ఆ పార్టీ సీనియర్లను విస్మయానికి గురిచేసింది. రేవంత్రెడ్డి వల్ల తమ ఉనికికే ప్రమాదం రావచ్చని వారు ఇప్పుడు బెదిరిపోతున్నారు.
70 ఏండ్లు దాటి, ఎన్నికల్లో ఓడిపోయిన వారిని తమ వెంట ఉంచుకోవడం దండుగ అనే ఆలోచన రేవంత్కు ఉండొచ్చు. పేరుకు కాంగ్రెస్లోనే ఉన్నా.. అసెంబ్లీలో అందరూ తనవాళ్లు ఉండాలనే ప్రణాళికతో ఆయన ముందుకెళ్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రేవంతే పార్టీ చీఫ్ కూడా అయినందున ఆయనకు ఎదురే లేకుండాపోయింది. రేవంత్ మాట కాదని మరో సీనియర్కు పార్టీ చీఫ్ పదవి ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నది. కొత్త చీఫ్, సీఎం మధ్య పొసగకపోతే రాష్ట్రంలో తమ పార్టీ పాలనకే గండం రావచ్చని అధిష్ఠానం పెద్దల భయం. తెగేదాకా లాగితే పార్టీని సీనియర్లకు వదిలేసి.. తనతో వచ్చే ఎమ్మెల్యేలను వెంటేసుకొని రేవంత్ సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశమూ ఉంది.
అదే జరిగితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేలందరూ ఆయనకు విధేయులుగా ఉంటారు. అందుకే సొంత బలం పెంచుకొనే దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్రెడ్డి నెరవేర్చడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అసాధ్యమే. ఈ విషయాన్ని గ్రహించిన జనం లోక్సభ ఎన్నికల్లో ఆయన వెంట నిలువలేదు. ఆరు నెలల కాలంలోనే ఫలితాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న చోట్ల కూడా బీజేపీ జెండా ఎగిరింది.
కాంగ్రెస్కు సమానంగా కమలం పార్టీ కూడా 8 లోక్సభ స్థానాలను గెలిచింది. అంటే దానర్థం.. సగం రాష్ట్రం కమలం పార్టీకి జై కొట్టినట్టే. అదీకాకుండా బీజేపీ తరఫున గెలిచిన ఎంపీలు బలమైన నేతలు. రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేయడానికి వారు పూనుకుంటారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, అమాత్యులు కావాలని వారు కలలు కంటారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవడం ద్వారా వచ్చే టర్మ్ కూడా తానే సీఎం అయ్యేలా రేవంత్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్పై వ్యతిరేకత వస్తే.. బీజేపీతో చేతులు కలిపి తన పదవిని పదిలం చేసుకునే అవకాశాన్ని ఆయన సృష్టించుకుంటున్నారు.
ఈ రాజకీయ గందరగోళంలో తెలంగాణ ఎటుగాని స్థితిలోకి జారుతున్నది. ఉద్యమంలో పాల్గొనని ప్రస్తుత పాలకులు, ఉత్తరాది పెత్తనాన్ని ఎదిరించలేని బీజేపీ నేతల మధ్య తెలంగాణ తన ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ముంగిట నిలిచి ఉన్నది. ఇప్పుడు రేవంత్రెడ్డి అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే నరేంద్ర మోదీ. ఈ వాస్తవాన్ని బహిరంగంగా ప్రకటించేందుకు రేవంత్ వెనుకాడటం లేదు.
‘నేను, చంద్రబాబు, నరేంద్ర మోదీ సర్కారు బడిలోనే చదువుకున్నాం’ అని ఇటీవల రేవంత్ గొప్పగా అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న తెలంగాణ నాయకుడు రేవంత్కు కానరాలేదా? బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఆదర్శనేత. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను, చంద్రబాబు విడిగా ఉండక తప్పడం లేదు’ అని రేవంత్ చెప్పారు. ఈ మాటలన్నీ వింటుంటే.. ‘ఎవరి పాలయిందిరా తెలంగాణ’ అని అనిపించకపోదు. తెలంగాణ చరిత్ర, అస్తిత్వం, ప్రజల ఆత్మగౌరవం పట్ల పాలకులకు స్పృహ ఉండాలి. లేదంటే వారు ఈ నేలపై పుట్టినా పరాయివాళ్ల కిందే లెక్క. అందుకే కష్టపడి సాధించుకున్న తెలంగాణ తాకట్టుపాలు కాకుండా ప్రజలు గమనిస్తూ ఉండాలి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి.
– బి.నర్సన్ 94401 28169