కొందరికి డబ్బు, ఇంకొందరికి కులం, మరికొందరికి రిజర్వేషన్ల ద్వారా రాజ్యాధికారం సాధ్యపడుతుంది. అయితే కింది వర్గాలు కనీసం గ్రామీణ స్థాయిలోనైనా అధికార పీఠాన్ని ఎక్కాలంటే మాత్రం రిజర్వేషన్లే పెద్దదిక్కు. కానీ, ఎలాంటి రిజర్వేషన్లు కూడా కింది సామాజిక వర్గాలకు సరైన న్యాయం చేయడం లేదు. గ్రామీణ స్థాయిలో అనేక రకాల సమస్యలు వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుండటమే అందుకు కారణం.
రాజ్యం ఎవరి చేతుల్లోకి రాత్రికి రాత్రే వచ్చి వాలిపోదు. దాని వెనుక ఎన్నో పోరాటాలు, ఎంతో మేధోమథనం జరిగి.. పునాదుల నుంచి కదిలొస్తేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. ఇదంతా కేవలం భూస్వాములుగా చెలామణిలో ఉన్న అగ్రవర్ణాలకు కలిసొస్తున్నాయి. అదే బీసీ సామాజిక వర్గాల్లో చైతన్యం రావాలంటే.. నాయకుల మీద నమ్మకం తక్కువ ఉండి విమర్శ ధోరణి ఎక్కువ ఉంటుంది.రాజకీయ చైతన్యం వచ్చినప్పటికీ పల్లెల్లో ఆధిపత్య సమాజం కింద నలిగిపోయే బీసీ సమాజం ఉండటం అడ్డంకిగా మారుతున్నది. రిజర్వేషన్ ఉంటేనే గ్రామాల్లో పోటీ చేయడానికి అర్హత ఉంటుంది. లేదంటే జనరల్ సీట్లో కనీసం పోటీ చేయాలని కూడా ఊహించలేం. మరికొన్ని గ్రామాల్లో రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఆధిపత్య వర్గాల చేతికింది మనిషికి టికెట్ ఇప్పించి, వాళ్ల చెప్పుచేతల్లో పెట్టుకొని రాజ్యమేలే వర్గాల పెత్తందారితనం ఇంకా నడుస్తున్నది.
రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలనిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం.. రిజర్వేషన్లు ఇవ్వడం వాటిలో ఒకటి. అయితే దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలంటే కులగణన చేసి తీరాల్సిందే. లేదంటే బీసీ సమాజం పెద్ద ఎత్తున నష్టపోతుంది.ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం కచ్చితంగా ఇవ్వాలనేది రాజ్యాంగంలో ఉన్నది. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదనేది సుప్రీంకోర్టు విధానం. ఇప్పుడు కులగణన చేసి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు లైన్ను దాటాల్సిందే.గతంలో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ సీలింగ్ను బ్రేక్ చేస్తూ.. 10 శాతం రిజర్వేషన్లను కొత్తగా ఇచ్చింది. దీని వలన సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధన కచ్చితంగా పాటించవలసిన అవసరం లేదని తెలిపోయింది. పై వర్గాలకు రిజర్వేషన్ ఫలాల కోసం ఏ ఉద్యమం కూడా జరగలేదు. రాత్రికి రాత్రే ఈడబ్ల్యూఎస్ కోటా గెజిట్లో ప్రత్యక్షమైంది. చట్టం చేసే హక్కు తమ చేతుల్లో ఉండటమే అందుకు కారణం.
జాతీయ స్థాయిలో వివిధ రాష్ర్టాల్లో 60 శాతానికి పైగా రిజర్వేషన్లు ఉన్నాయి. గతేడాది బీహార్ ప్రభుత్వం కులగణన జరిపి.. ఓబీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లను పెంచింది. ఆయా రాష్ర్టాలలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 75 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయితే రిజర్వేషన్లు తగ్గించే అధికారం రాష్ర్టానికి ఉంటుంది కానీ, పెంచే అధికారం కేంద్రప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. అందుకే బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామనే కాంగ్రెస్ హామీ సత్యదూరమే అనడంలో సంశయం అక్కర్లేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల తర్వాత హేయంగా బతుకుతున్నది ఎవరైనా ఉన్నారంటే అది బీసీ సామాజికవర్గానికి చెందినవారే. కొన్ని కులాలు దళితుల కంటే దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నాయి. రాష్ట్రంలోని వందకు పైగా బీసీ కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను లెక్కగట్టి.. వాళ్ల జీవన విధానాన్ని బయటకు తీస్తేనే సరైన ఆధారాలు లభిస్తాయి. లేదంటే మరొకసారి తీరని అన్యాయం జరుగుతుంది. అందుకే మన అణగారిన వర్గాల ప్రజలు చట్టాలు చేసే అసెంబ్లీలో, పార్లమెంటులో ఉంటేనే మనకు రాజ్యాంగ ఫలాలు దక్కుతాయి. తద్వారా రేపటి తరాలు రాజ్యాధికారాన్ని అనుభవిస్తాయి.
– అవనిశ్రీ 99854 19424