ఈనెల 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలను దేశమంతా ఆసక్తిగా చూస్తున్న వేళ హడావుడిగా నీట్ -యూజీ 2024 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. వాస్తవానికి నీట్ ఫలితాలను జూన్ 14న విడుదల చేయాల్సి ఉంది. ఎందుకో తెలియదు గానీ, 10 రోజుల ముందుగానే అంటే సరిగ్గా జూన్ 4న ఎన్టీఏ వీటిని విడుదల చేసేసింది. ఆ ఫలితాలను చూసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 67 మంది విద్యార్థులకు ఆల్ ఇండియా నెంబర్ వన్ ర్యాంక్ రావడమే అందుకు కారణం.
NEET UG | ఎన్నికల ఫలితాలపై ఉన్న ఆసక్తితో ఆరోజు వాటిపై ఎవరూ పెద్దగా దృష్టి సారించలేదు. కానీ, ఆ ఫలితాల్లో జరిగిన అవకతవకలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. గతంలో ఆల్ ఇండియా నెంబర్ వన్ ర్యాంకు ఇద్దరికి లేదా ముగ్గురికి మహా అయితే నలుగురికి వచ్చేది. కానీ, ఈసారి మాత్రం ఎన్నడూ లేని విధంగా 67 మంది టాపర్లే కావడం గమనార్హం. అందులోనూ ఒకే సెంటర్కు చెందిన ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించడం ఒకింత ఆశ్చర్యానికి, అనుమానాలకు తావిస్తున్నది.
ఈ ఏడాది భారత్తో సహా 14 విదేశీ నగరాల్లోని 4 వేలకు పైగా పరీక్ష కేంద్రాల్లో నీట్ జరిగింది. 24.06 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 13,16, 268 (56.4 శాతం) మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యా రు. అయితే దేశవ్యాప్తంగా 550 మెడికల్ కాలేజీలు ఉండ గా.. వాటిలో సుమారు 80 వేల సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో వైద్య విద్యకు డిమాండ్ ఎక్కువైంది. దేశ భవిష్యత్తును, లక్షల మంది విద్యార్థుల తలరాతను నిర్దేశించే పరీక్ష పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు కొంతమంది విద్యార్థులకు వచ్చిన మార్కులపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా నీట్లో 180 పశ్నలుంటాయి. ఒక్కో సరైన ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్క్ ఉంటుంది. ఇక్కడే అసలు వివాదం తలెత్తింది. కొంతమంది విద్యార్థులకు 720 మార్కులకు గానూ 719, 718 మార్కులు వచ్చాయి. ఇలా రావడమే అవకతవకలు జరిగాయనడానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది. ఎందుకంటే 180 ప్రశ్నలకు గానూ ఓ విద్యార్థి 179 సరైన సమాధానాలను గుర్తిస్తే అతనికి 716 మార్కులు వస్తాయి. ఆ విద్యార్థి 180వ జవాబును తప్పుగా గుర్తించినందుకు గానూ అతనికి వచ్చిన 716 మార్కుల నుంచి నెగెటివ్ విధానం మూలంగా ఒక మార్కును తగ్గించాలి. తద్వారా ఆ విద్యార్థికి 715 మార్కులు మాత్రమే రావాలి. కానీ, అందుకు విరుద్ధంగా కొంతమందికి 719, 718 మార్కులు రావడం అనుమానాస్పదమైంది. ఇది ఏ విధంగానూ సాధ్యపడదు.
ఈ వివాదంపై ఎన్టీఏ డైరెక్టర్ స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉన్నది. పరీక్ష నిర్వహించడంలో ఆలస్యం అయినందున వారికి గ్రేస్ మార్కులు కలిపామని పొంతనలేని సమాధానం ఇచ్చారు. ఒకవేళ పరీక్ష ఆలస్యంగా నిర్వహిస్తే.. విద్యార్థులు ఎంత సమయాన్ని నష్టపోయారో అంత సమయాన్ని అదనంగా కేటాయించాలి. అంతేకానీ గ్రేస్ మార్కులు కలుపుతారా? అసలు ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు కలిపారు? ఎవరెవరికి, ఎంత మేరకు కలిపారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
నీట్ పరీక్షకు సరిగ్గా ఐదు రోజుల ముందు బీహార్లో ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వార్త రావడం కలకలం రేపింది. నలుగురిని పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. జవాబులతో కూడిన ప్రశ్నాపత్రాలను రూ.30-50 లక్షల చొప్పున 30 మంది విద్యార్థులకు అమ్మినట్టు పోలీసులు వెల్లడించారు. దీనిపై పలువురు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఫలితాలు వెల్లడించకుండా స్టే విధించాలని కూడా కోరారు. కానీ, స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఇదే అదునుగా భావించిన ఎన్టీఏ హడావుడిగా ఫలితాలను విడుదల చేసేసింది. ఈ వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో ఈ ఏడాది ప్రశ్నాపత్రం చాలా సులువుగా ఉందని, దానికి తోడు గ్రేస్ మార్కులు కలపడంతో చాలామంది టాప్ ర్యాంకులు సాధించారని చెప్పి ఎన్టీఏ డైరెక్టర్ చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు.
ఈ లీకేజీ వివాదంతో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఎన్నికల వేళ విద్యార్థులతో కలిసి పరీక్షా పే చర్చ అంటూ హడావుడి చేసే ప్రధాని మోదీ దీనిపై కనీసం స్పందించడం లేదు. కనీసం సుప్రీంకోర్టు అయినా జోక్యం చేసుకోవాలి. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే దీనిపై విచారణ చేపట్టేలా చూడాలి. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. అదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు, తప్పులు జరగకుండా చూడాలి. దాం తో పాటు ఈ పరీక్షను వెంటనే రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.