మృగశిర కార్తె పోయి ఆరుద్ర కార్తె నడుస్తున్నది. మరో మూడు రోజుల్లో పెద్ద పుశాల కూడా వస్తున్నది. నైరుతి రుతు పవనాలు ఈసారి ముందే వచ్చినా.. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు పడలేదు. మే నెలలో దంచికొట్టిన వానలు జూన్లో మోస్తరుగానే సరిపెట్టాయి. రాష్ట్రంలో సుమారు 16 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదవుతున్నది. పల్లెల్లో ‘వానదేవుడో.. వర్షదేవుడో..’ అంటూ పిల్లలు కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. మహిళలు బొడ్రాయికి బిందెలతో నీళ్లు పోసి పూజలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆరుద్ర పోతే ఆదెరువు పోయినట్టేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తుకాలు (వరి నారుమడులు) పోసుకోవడానికి ఇదే అనువైన సమయం. పెద్ద పుశాలలో విత్తనాలు ఎవరూ చల్లరు. పెద్ద పుశాలలో విత్తనాలు వేస్తే పెద్దలకు ముట్టినట్టేనని ఓ నానుడి.
ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షోభం అంచున ఉన్న వ్యవసాయాన్ని చూసి రైతులు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్కారు నుంచి అందాల్సిన వానకాలం పెట్టుబడి సాయం ఇంకా రానే లేదు. ఇప్పట్లో వస్తదనే నమ్మకమూ లేదు. అయినప్పటికీ అప్పులు తెచ్చి విత్తనాలు వేసిన రైతులు అవి మొలకెత్తేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. బిందెలతో నీళ్లు పోసి పంటలకు తడి అందిస్తూ కాలమైతదో కాదోనని కలవరపడుతున్నారు. కరువు కాటేస్తదేమోనని కంగారు పడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరువు బతుకులను కండ్లారా చూసిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఆ పరిస్థితులు రావొద్దని కోరుకున్నారు. ‘మొగులు (ఆకాశం)కు ముఖం పెట్టకుండా రైతులు వ్యవసాయాన్ని చేయాలి’ అని సంకల్పించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన సమీక్షల్లో ‘దక్కన్ పీఠభూమి అయిన తెలంగాణలో 90 శాతం రాతిపొరల నేలలే. పారకంపై కాకుండా నీటిని ఒడిసి పట్టి వ్యవసాయం చేయాలె’ అని కేసీఆర్ తరచూ చేప్పేవారు. వరద నీటిని ఒడిసి పట్టాలని ముందుగా మైనర్ ఇరిగేషన్పై ప్రత్యేక దృష్టిపెట్టిన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ తొలి కార్యక్రమంగా ‘మిషన్ కాకతీయ’ను తీసుకున్నారు. దాదాపు రూ.5,249 కోట్లతో కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, చెక్డ్యామ్లను పునరుద్ధరించారు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధి హామీ పథకంలో 23 రకాల పనులను నీటిపారుదల శాఖ పరిధిలోకి తీసుకువచ్చి కాలువల్లో పూడికతీతలు చేపట్టారు. ఇలా కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన పనుల వల్ల దేశంలో అత్యధికంగా మైనర్ ఇరిగేషన్ స్కీములు ఉన్న మొదటి 5 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.
కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన ఎంఐ 6వ సెన్సెస్ నివేదిక ప్రకారం… దేశంలో అత్యధికంగా యూపీలో 39.76 లక్షలు (17.2 శాతం), మహారాష్ట్రలో 35.73 లక్షలు (15.49 శాతం), మధ్యప్రదేశ్లో 22.85 లక్షలు (9.9శాతం), తమిళనాడులో 21.15 లక్షలు (9.1 శాతం) ఎంఐ స్కీములు ఉండగా, 16,79,868 (7.1 శాతం) ఎంఐ స్కీములతో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. మైనర్ ఇరిగేషన్ మెరుగుపడి రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకున్నాక కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేశారు. గోదావరి జలాలను ఎత్తిపోస్తూ.. తెలంగాణ నెత్తిన నీటి కుండలా కాళేశ్వరం ప్రాజెక్టును తీర్చిదిద్దారు. ఆపై ఈ ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులకు కరువు లేకుండా చేశారు. ఏటా డిసెంబర్, జనవరిలోనే చెరువులు, కుంటలను నింపి యాసంగి పంటకూ నీటికొరత రాకుండా చూశారు.
రెండు పంటలకు నీళ్లు రావడంతో తెలంగాణ ఏర్పాటుకు ముందు 1.31 కోట్ల ఎకరాలు మాత్రమే ఉన్న సాగు విస్తీర్ణం 2.20 కోట్ల ఎకరాలకు పెరిగింది. భారీగా పెరిగిన సాగు విస్తీర్ణంతో భూమికి బరువయ్యేంత పంట దిగుబడి వచ్చింది. తొమ్మిదేండ్లలోనే తెలంగాణ దేశానికి అన్నం గిన్నెగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 11.6 శాతం వృద్ధిరేటు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించింది. వ్యవసాయ రాష్ర్టాలైన మహారాష్ట్రలో 5.683 శాతం, మధ్యప్రదేశ్ 4.602 శాతం, ఉత్తరప్రదేశ్లో 5.127 శాతం, పంజాబ్లో 0.811 శాతం మాత్రమే వృద్ధిరేటు నమోదైంది. దేశంలో విస్తీర్ణం, జనాభా పరంగా పెద్దవైన రాష్ర్టాలు కూడా తెలంగాణ దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్రంలో కరువు బతుకులను కండ్లారా చూసిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఆ పరిస్థితులు రావొద్దని కోరుకున్నారు. ‘మొగులు (ఆకాశం)కు ముఖం పెట్టకుండా రైతులు వ్యవసాయాన్ని చేయాలి’ అని సంకల్పించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన సమీక్షల్లో ‘దక్కన్ పీఠభూమి అయిన తెలంగాణలో 90 శాతం రాతిపొరల నేలలే. పారకంపై కాకుండా నీటిని ఒడిసి పట్టి వ్యవసాయం చేయాలె’ అని కేసీఆర్ తరచూ చేప్పేవారు.
ఇంతటి ఘనత వహించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వ్యవసాయం మళ్లీ నేల చూపులు చూస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. కేసీఆర్ హయాంలో పట్నం నుంచి పల్లెలకు వలసలు వెళ్తే.. కాంగ్రెస్ హయాంలో పల్లెల నుంచి పట్టణాలకు మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల కాలంలోనే రైతులు అరిగోస వెళ్లదీశారు. యాసంగి ధాన్యం కొనుగోలు ఓ ప్రహసనంగా కొనసాగింది. ఎన్నికల హడావుడి వల్ల ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని అనుకున్నా.. ఎన్నికల కోడ్ ముగిశాక కూడా అదే పరిస్థితి ఉంది. వానకాలం సీజన్ ప్రారంభంలో జనుము, జీలుగ, పచ్చిరొట్టె విత్తనాల కోసం కూడా రైతులు చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. వడ్లకు బోనస్ ఇస్తామని గద్దెనెక్కిన ప్రభుత్వం సన్నాలకు మాత్రమే బోనస్ అంటూ రైతులను అయోమయంలో పెట్టింది.
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో తుకాలు పోసేందుకు ఇప్పటికే ఆలస్యమవుతున్నది. కాలం అదును దాటితే ఏ పంటలూ దిగుబడులు రావు. సాధారణంగా వరి పంట కాలం 120 నుంచి 145 రోజుల వ్యవధి ఉంటుంది. దొడ్డురకం వడ్లకు 120 రోజులు, సన్నరకం వడ్లకు 145 రోజుల సమయం పడుతుంది. ఇప్పటి నుంచి లెక్కగట్టినా సన్నరకాలను సాగు చేయాలంటే రైతులకు వరి పొట్టకొచ్చేసరికి వానకాలం అయిపోతుంది. ఆ సమయానికి వరి పంటకు తడి అందకుంటే దిగుబడి రాదు. పైగా దొడ్డు రకం వడ్లతో పోల్చితే సన్నరకం వడ్లకు తెగుళ్ల బెడద ఎక్కువ.. దిగుబడి తక్కువ.
సమృద్ధిగా నీటి వసతి ఉన్న రైతులు మాత్రమే సన్నరకం వరిసాగు చేయడం ఉత్తమం. ఇప్పటికే మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటును సాకుగా చూపి లక్షల క్యూసెక్కుల నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం సముద్రంపాలు చేసింది. కాళేశ్వరం నుంచి ఒక్క ఎకరాకు సాగు నీరు అందించలేదని, అది ఎందుకు పనికి రాని ప్రాజెక్టు అని నోటికొచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు మళ్లీ ఆ ప్రాజెక్టే దిక్కయింది.
తాజాగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు కొండపోచమ్మసాగర్ నుంచి రెండు టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎగువ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద రాకపోవడంతో ఆయకట్టు రైతుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో వరినాట్లు అయినా, వరికోతలైనా నిజామాబాద్ జిల్లా రైతులే మొదటగా ప్రారంభిస్తారు. అన్ని రకాలుగా ముందుండే నిజామాబాద్ రైతులే వరినాట్లకు నానా అగచాట్లు పడుతున్నారంటే.. రాష్ట్రంలో ఇతర జిల్లాల రైతుల పరిస్థితి వేరే చెప్పాల్సిన పనిలేదు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకున్నట్టే. గత డిసెంబర్, జనవరి నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు, కుంటలను నింపి ఉంటే వానకాలం వ్యవసాయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది. అందుకే మొగులును చూడని మాగాణాన్ని సృష్టించినపుడే రైతు రాజవుతాడు.
– మారెడ్డి సంజీవ్ కుమార్ 91827 77465