అలవిమాలిన హామీలతో అందలమెక్కిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయలేక చతికిలపడుతున్నది. అధికారం మీది యావతో ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు. ఇప్పుడు వస్తున్నదాని కంటే ఇంకా ఎంతో ఎక్కువే వస్తుందని ఆశచూపారు. ప్రజల దృష్టి మరలించి హస్తలాఘవంతో ఓటును కాజేశారు. అధికారం చేజిక్కించుకున్నారు. చివరకు ఏం జరిగింది? ఆరు నెలలు గడిచినా హామీల అమలు తెమలడం లేదు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచించి ఇచ్చిన హామీలైతే కొంచెం వెనుకా ముందూ అమలు చేయొచ్చు. కానీ, లెక్కాపత్రం చూసుకోకుండా బులిపించి, బుట్టలో వేసుకునేందుకు ఇచ్చిన హామీలు కదా! ఇరికి ఇగిలిస్తున్న సర్కారు కుంటిసాకులతో దాటవేస్తున్నది. రేపు, మాపు అంటూ ప్రజ లను మభ్యపెడుతున్నది.
గత ప్రభుత్వ హయాంలో రెప్ప వాల్చేంతసేపు కూడా కరెంటు పోయేది కాదు. కానీ కాంగ్రెస్ పాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్ర రైతాంగానికి కరెంటు కష్టాలు షురూ అయ్యాయి. పంట నష్టాలతో సాగు అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితుల్లో పంట పెట్టుబడి సాయమైన రైతుబంధు ఎండమావిలా తయారైంది. రైతు సాగుకు సన్నద్ధమయ్యే సమయంలో అందాల్సిన పెట్టుబడి సాయం పంట కోతలైనా చేతికందడం లేదు. పెంచి ఇస్తామన్న రైతుభరోసాకు అతీగతీ లేదు. కౌలురైతుల సాయం లెక్క ఇంకా తేలనేలేదు. విధివిధానాలే ఖరారు కాలేదు. చర్చలతోనే కాలయాపన జరుగుతున్నది. ఇక నిరుద్యోగుల పరిస్థితి మరీ దారుణం.
మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు ‘ఓటు కొట్టు జాబు పట్టు’ అన్నట్టుగా వారిని ఊరించారు. తీరా గెలిచాక ఉసూరుమనిపిస్తున్నారు. గోడ మీద క్యాలెండరు మారుతున్నది కానీ, జాబ్ క్యాలెండర్ మాత్రం గోడ మీదకు రావడం లేదు. పోస్టుల పెంపూ ఉత్తమాటే అయ్యింది. డీఎస్సీలో ‘మెగా’ చేతివాటం చోటుచేసుకున్నది. గెస్ట్ లెక్చరర్ల పర్మనెంటుకు ఇంకా ముహూర్తం రానేలేదు.
గురుకుల కొలువుల భర్తీల కోసం సీఎం ఇంటి ముందు నిరసనలు చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ వెనుకకు వెళ్లిపోయింది. పెంచిన పెన్షన్ కోసం పండుటాకులు ధర్నాలకు దిగడం సర్కారుకు సిగ్గుచేటు. పేదింటి ఆడపిల్లల పెండ్లికి ఇచ్చే కల్యాణలక్ష్మి కోసం కోర్టు మెట్లెక్కితే సర్కారు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. తులం బంగారం హామీ గుంజెత్తు కూడా అమలు కావడం లేదు. ఇప్పటిదాకా ఉన్నది ఇస్తే చాలు.. అదే పదివేలని జనం అనుకునే పరిస్థితి తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.
రుణమాఫీ గురించి క్యాబినెట్లో చర్చించామన్నారు. ఏం చర్చించారో చెప్పడం లేదు. ఎట్ల అమలు చేస్తరో ఇప్పటివరకూ చెప్పలేకపోయారు. ఆర్టీసీని నడుమన పడేసి ఉచిత బస్సు హామీ, విద్యుత్తు శాఖ మీద బరువు మోపి గృహజ్యోతి హామీని మాత్రమే అమలులోకి తేగలిగింది. 420 హామీలు గాలిమాటలయ్యాయి. రేపుమాపుల సుడిగుండంలో చిక్కుకొని గిరగిరా తిరుగుతున్నాయి. మోసపోయి గోసపడుతున్నమని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు ఇదివరకటి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నది కాంగ్రెస్ సర్కారు. ఒక వేలుతో నువ్వు అవతలి వైపు చూపితే మిగిలిన నాలుగు వేళ్లు నీ వైపు చూపుతాయనే ఇంగితం మరిచిపోతే ఎలా? ఏమరుపాటున గద్దెనెక్కించిన ప్రజలు సరైన సమయం వస్తే గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ పెద్దలు గుర్తిస్తే మంచిది.