తెలంగాణలో కుట్ర రాజకీయాల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ ఆత్మగౌవరం, అస్తిత్వంపై ఆధిపత్యం కోసం ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పావులు కదుపుతున్నారు. తన శిష్యుడు రేవంత్రెడ్డి తెలంగాణ సీఎం కావడంతో బాబుకు ఇప్పుడు కొత్త ఆశలు చిగురిస్తున్నట్టున్నాయి. 2014లో విభజన హమీలను గాలికొదిలేసి రాత్రికిరాత్రే ఏపీకి పలాయనం చిత్తగించిన చంద్రబాబు.. ఇప్పుడు హఠాత్తుగా హామీలంటూ డ్రామాలెందుకు మొదలుపెట్టారు. నిజంగానే చంద్రబాబుకు విభజన సమస్యల గురించి చర్చించే ఉద్దేశం ఉందా? లేదా తన మనసులో ఇంకేదైనా ఉందా? అనేది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ వైపు కన్నెత్తి చూసేందుకు గజగజ వణికినవారు ఇప్పుడు ఏకంగా తెలంగాణ సంపదపై ఆధిపత్యం కోసం ఎత్తుగడలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఆంధ్రా ఆధిపత్యవర్గాల కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొడుతూనే ఉన్నారు. తెలంగాణకు అవమానం జరిగిన ప్రతీసారి ప్రజలు ముక్తకంఠంతో తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉన్నారు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సర్కార్ మారడంతో సమైక్యవాదులు మళ్లీ తెలంగాణపై కన్నేశారు. తెలంగాణ ఉద్యమంతో గానీ, తెలంగాణ ఆత్మగౌవరం, ఆస్తిత్వంతో గానీ సంబంధం లేని వ్యక్తి అయిన రేవంత్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆర్థిక దోపిడీదారులకు మరోసారి తెలంగాణ మీద ఆశలు చిగురిస్తున్నట్టున్నాయి.
నిజానికి రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ ఆయనను తమవాడిగా భావించడం లేదు. పైగా తెలంగాణ ఉద్యమంతో రేవంత్రెడ్డికి ఎలాంటి పేగుబంధం లేకపోవడం, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన గత చరిత్ర ఉండటంతో ప్రజలకు ఆయనపై నమ్మకం కుదరడం లేదు. టెక్నికల్గా రేవంత్రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఆయన ఆత్మ మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబుతోనే ఉందన్న విమర్శలు అటు కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఇటు తెలంగాణ సమాజం నుంచి సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతేకాదు, తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్రెడ్డిని ‘మావాడు కాద’నుకుంటుంటే.. సమైక్యవాదులు, టీడీపీ శ్రేణులు మాత్రం రేవంత్రెడ్డిని ఓన్ చేసుకుంటున్నారు. ‘మా సీఎం.. మా రేవంత్రెడ్డి.. మా టీడీపీ మొక్క’ అని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వంపై పదేండ్ల తర్వాత దండయాత్ర చేసేందుకు తెలంగాణ వ్యతిరేక శక్తులు ఒక్కటవుతున్నాయి.
ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఏపీ పాలనాధికారం చేతి లో ఉండటం, కేంద్రంలో కింగ్మేకర్ కావడంతో ఆయ న ధోరణి మారింది. ఈ నేపథ్యంలోనే ఏపీ విభజన చట్టంలోని సమస్యలు అంటూ కొత్త రాజకీయ వ్యూహాలను ఆయన తెరపైకి తీసుకువచ్చారు. వాస్తవానికి తెలంగాణ ఏర్పాటును టీడీపీ గట్టిగా వ్యతిరేకించింది. తెలంగాణ ఏర్పాటు సుతరాం ఇష్టం లేని చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు నామ్కే వాస్తే రెండుకండ్ల సిద్ధాంతంతో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. అనేక సంఘర్షణలు, చర్చలు, లాబీయింగ్ల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అయితే విభజన చట్టంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం అనేక అంశాలను పొందుపర్చింది. తెలుగు రాష్ర్టాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ సహా ఇతర అంశాలను జటిలంగా మార్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అనేక విభజన అంశాలు పరిష్కరించకుండా బీజేపీ సర్కార్ తెలుగు రాష్ర్టాలకు అన్యాయం చేసింది. తెలంగాణ అభివృద్ధికి విభజన చట్టంలోని కొన్ని అంశాలు అడ్డుగా ఉన్నాయని అప్పటి సీఎం కేసీఆర్ వాటి పరిష్కారం కోసం కేంద్రంపై అనేక రకాలుగా ఒత్తిడి తీసుకువచ్చారు. సీఎం హోదాలో కేసీఆర్ ప్రధానిని కలిసి విన్నవించారు. కేంద్ర హోం శాఖకు లెక్కలేనన్ని లేఖలు రాశారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపల అనేక పోరాటాలు చేశారు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ ప్రజల గోసను పట్టించుకోలేదు. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకునేందుకు విభజన హామీలను మరింత జటిలంగా మార్చింది.
2014లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. అయినా విభజన చట్టంలోని అంశాల పరిష్కారంపై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత రాత్రికిరాత్రే హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు ఎప్పుడూ విభజన హామీల గురించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదు. అంతేకాకుండా తెలంగాణలోని ఏడు మండలాలను అక్రమంగా ఏపీలో కలుపుకొన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే ప్రమాణస్వీకారం చేస్తానని కేంద్రాన్ని బెదిరించినట్టు స్వయంగా చంద్రబాబే అంగీకరించారు.
చంద్రబాబు ఇప్పుడు మరోసారి తెలంగాణను తన గుప్పిట పెట్టుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్నాళ్లు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు జంకిన చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్ దిగిపోగానే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు విభజన సమస్యలను ఒక అవకాశంగా మార్చుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్షంగా వేలుపెడితే.. రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దొడ్డిదారిలో ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే విభజన హామీలపై చర్చిద్దామంటూ రేవంత్రెడ్డికి లేఖ రాయడంపై తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబు కుట్రలపై తెలంగాణ సమాజం ఆందోళన చెందుతున్నది. నిజానికి విభజన హామీల పరిష్కారం రెండు రాష్ర్టాలకు మేలు చేసేదే. కానీ, విభజన చట్టాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాల్లో వేలుపెడితే మాత్రం మన రాష్ర్టానికి తీవ్ర నష్టం జరుగుతుంది. సీఎం రేవంత్రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణను విఫల రాష్ట్రంగా మార్చి, ఇక్కడి వ్యాపార సంస్థలను ఏపీకి తరలించే వ్యూహంతో చంద్రబాబు రాష్ర్టానికి వస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే గత ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ విధ్వంసమైంది. ఇప్పుడు విభజన సమస్యలంటూ రాష్ట్రంలోకి శకునిలా చంద్రబాబు ప్రవేశిస్తున్నారని మండిపడుతున్నారు తెలంగాణ వాదులు.
విభజన హామీలపై చర్చించేందుకు సీఎం రేవంత్రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం వెనుక తెలుగు రాష్ర్టాల్లో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. ఏపీలో వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఏపీలో ఆ మూడు పార్టీల టాస్క్ పూర్తికావడంతో వారి కన్ను ఇప్పుడు తెలంగాణపై పడింది. ఆ కూటమి పేరిట తెలంగాణలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కుట్రలో చంద్రబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విభజన హామీల పేరుతో తెలంగాణ రాష్ట్రంపై ఆధిపత్యం సాధించి.. కూటమి బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ తమ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశాయి. ఇందుకు గవర్నర్ వ్యవస్థను బీజేపీ వాడుకుంది. ప్రభుత్వాలను కూల్చడంలో గవర్నర్ వ్యవస్థను బీజేపీ ఎలా దుర్వినియోగం చేసిందో తెలిసిందే. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలే తెలంగాణ కేంద్రంగా చేస్తున్నది. ఈ ప్లాన్లో భాగంగానే చంద్రబాబు సీఎం అయిన వెంటనే తెలంగాణ గవర్నర్ ఏపీలో పర్యటించారు. తన పర్యటనలో చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ రోజే తెలంగాణలో కుట్ర రాజకీయాలకు బీజం పడిందన్న వాదనను తెలంగాణవాదులు బలంగా వినిపిస్తున్నారు. ప్రొటోకాల్కు పూర్తి విరుద్ధంగా తెలంగాణ గవర్నర్, ఏపీ సీఎం చంద్రబాబును కలవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఆ సమావేశంలోనే తెలంగాణలో ఎలాంటి రాజకీయాలు చేయాలో చర్చించారన్న టాక్ బలంగా వినిపించింది.
చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ జరిగిన వారం రోజుల్లోనే సీఎం రేవంత్రెడ్డి గవర్నర్ను కలిశారు. ఈ భేటీపై తెలంగాణ ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తన గురువు చంద్రబాబు ఏం కబురు పంపారో తెలుసుకునేందుకే గవర్నర్ను రేవంత్రెడ్డి కలిశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇప్పటికే ఏపీలో బలం పెంచుకున్న బీజేపీ తెలంగాణలోనూ పూర్తిస్థాయి రాజకీయ పట్టు సాధించేందుకు గవర్నర్ వ్యవస్థను వాడుకుంటున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.
(ఇంకా ఉంది)
– తోటకూర రమేశ్