నేడు ఎమ్మెల్యేలు, నాయకులు కొందరు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న క్రమంలో కొన్ని సోకాల్డ్ మీడియా సంస్థలు బీఆర్ఎస్ పనైపోయిందనే పైశాచికానందాన్ని పొందుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పైకి లేవదు, ఆ పార్టీలో కేసీఆర్ ఒక్కరే మిగులుతారని వింతగా మాట్లాడుతున్నాయి. నిజానికి ఇదొక పెద్ద మైండ్ గేమ్.
బీఆర్ఎస్, కేసీఆర్ పనైపోయిందనుకొని సంబురపడ్డ ప్రతీసారి ఆ అనుకున్నవాళ్లే పతా లేకుండాపోయారు. కేసీఆర్ మాత్రం కిందపడ్డ ప్రతీసారి రెట్టించిన వేగంతో ఉవ్వెత్తున పైకి లేశారు. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన తొలినాళ్లల్లో కూడా ఇవే మాటలు. ‘ఈ బక్కమనిషితో తెలంగాణ వస్తదా, అసలు టీఆర్ఎస్ ఉంటదా, ఈయన తెలంగాణ తెస్తడా’ అని హేళన చేసిర్రు. తొలి అడుగులోనే టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది. ఉద్యమ ప్రస్థానంలో వైఎస్సార్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటే వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒకేసారి కిందపడింది. ఆ దశలో కూడా టీఆర్ఎస్ పనైపోయిందనుకున్నారంతా. కానీ తన వ్యూహాలతో రెట్టింపు వేగంతో టీఆర్ఎస్ మళ్లీ పైకి లేచింది. గండర గండడు కేసీఆర్. అతను తలచుకుంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించగలరు. రాదనుకున్న తెలంగాణను, సాధించి చూపెట్టిన ఘనత కేసీఆర్కు దక్కింది.
ఒక్క ఓటమితో కేసీఆర్ పనైపోయిందనుకోవటం మూర్కత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కేవలం 2 శాతం ఓట్ల తేడాతోనే. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం లేదు కదా అని ప్రజలు బీజేపీకి కొంత డైవర్టయ్యారు తప్పితే తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పెద్దగా విశ్వసనీయత లేదనే విషయం ఇప్పటికే అర్థమైంది. లేకుంటే మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం 10 సీట్లయినా వచ్చేవి. దేశవ్యాప్తంగా ‘ఇండియా’ కూటమికి ప్రజలనుంచి మంచి ఆదరణ లభించింది. కానీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆశించిన సీట్లు రాలేదు. రెండు జాతీయ పార్టీలు సరి సమానంగా సీట్లను పంచుకున్నాయి. కేసీఆర్ను బలహీనపరిచి బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలనే వ్యూహంతో రెండు జాతీయపార్టీలు తమ సిద్ధాంతాలు మరిచిపోతున్నాయి. ఇందులో భాగంగానే కొందరు ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకుంటూ కార్యకర్తల్లో ఆందోళన పుట్టిస్తున్నారు. పెద్ద పెద్ద పదవులనుభవించిన వాళ్లు సైతం కేసీఆర్ను మోసం చేసి కాంగ్రెస్లో చేరుతున్నారు. అది వారి విజ్ఞతకే వదిలివేయాలి. కానీ, నాయకులు పార్టీలు మారినంత మాత్రాన ప్రజలు, కార్యకర్తలు వారి వెంట వెళ్తారనుకోవడం మూర్కత్వమే అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, రాష్ట్ర పునర్నిర్మాణ దశలో కేసీఆర్ లక్షలాది మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నాయి. కానీ, పాలన పట్ల అవగాహన లేని నాయకులు ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్నందువల్ల ప్రజల నుంచి చీదరింపులను, ఛీత్కారాలను ఎదుర్కొంటున్నది. వారి పుణ్యమాని కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమనే ముద్ర తెచ్చుకున్నది. సంక్షేమ పథకాల అమలు సరిగా కావడం లేదు. ఫ్రీ బస్తో అబాసుపాలైంది. రైతుబంధు వేయటంలో విఫలమైంది.
తప్పులు మీద తప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టి మరల్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకున్నది. కేసీఆర్ అవినీతి చేశారంటూనే విచారణ అంటూ కమిషన్ల పేరిట కాలయాపన చేస్తున్నది. కరెంట్ విషయంలో కేసీఆర్ స్కాం చేశారంటూ అబద్ధపు ప్రచారాలను ముందరేసుకున్నది. మచ్చలేని హరీశ్రావుపైనా అపనిందలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు శునకానందం పొందుతున్నారు. ఇదంతా ఒక డైవర్షన్ గేమ్.
కేసీఆర్ను బదనాం చేసి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ఆ పార్టీని అస్థిరపరచాలనే కుట్రలు కాంగ్రెస్ పార్టీ పన్నుతున్నది. కానీ, బీఆర్ఎస్ను కాపాడుకోవటం ఇప్పుడు కేసీఆర్ కంటే తెలంగాణ ప్రజలకే అవసరం. ఎందుకంటే తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేది, తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. బీఆర్ఎస్కు మొన్నటి ఓటమి ఒక్క స్పీడ్ బ్రేకర్ వంటిది మాత్రమే. ఇన్నేండ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ ఎన్నో ఒడిదుడుకులను చూసింది. రెట్టించిన వేగంతో మళ్లీ పైకి లేచింది కూడా. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ చేయవలసిందల్లా ఒక్కటే. ఇన్నేండ్లలో ఆర్థికంగా చితికిపోయి, అవకాశాలు రాక ఉన్న నిఖార్సయిన, నిజమైన ఉద్యమ కార్యకర్తలకు బలాన్నిచ్చి వారికి మేమున్నామనే భరోసా ఇవ్వాలి.
– తెలంగాణ విజయ్
94919 98702