పాతనీరు పోయి కొత్త నీరు వచ్చినట్టుగానే సుమారు ఒకటిన్నర శతాబ్దాల కాలం నాటి నేరాలు, సాక్ష్యాలు, శిక్షల చట్టాలు పోయి, వాటి స్థానంలో కొత్త చట్టాలు వచ్చాయి. ఇప్పటిదాకా వ్యవహారంలో ఉన్న ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కాలగర్భంలో కలిసిపోయాయి. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ అనే కొత్త చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. గత పార్లమెంటులో పెద్దగా చర్చ లేకుండానే వీటిని ఆమోదించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో అనేకమంది విపక్ష సభ్యులు సస్పెన్షన్కు గురై సభాకార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడం గమనార్హం.
కొత్త చట్టాల్లోని అనేక నిబంధనలు ఆధునిక సాంకేతికతను ఒడిసిపట్టే విధంగా ఉండటం విశేషం. ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమన్లు పంపడం, నేర ప్రదేశాల పరిశీలనను తప్పనిసరిగా వీడియో తీయడం, ఆన్లైన్ ద్వారా ఫిర్యాదుల నమోదు, జీరో ఎఫ్ఐఆర్ వంటివి ఈ సందర్భంగా ఉదహరించవచ్చు. బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం, అరెస్టయిన వ్యక్తి సూచించిన సంబంధీకులకు సమాచారం అందజేయడం వంటివి కూడా ఆహ్వానించదగిన మార్పులే. పోలీసుల ఇష్టారాజ్యానికి ఈ తరహా నిబంధనలు అడ్డుకట్ట వేస్తాయని చెప్పవచ్చు.
నేరవిచారణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే విధంగా ఈ నిబంధనలు రూపొందాయి. ఇదివరకు ఓ వ్యక్తి అరెస్టయితే ఆ వివరాలు తెలుసుకోవడం గగనంగా ఉండేది. కానీ, ఇప్పుడలా కాదు. అరెస్టు సమాచారం పోలీసు స్టేషన్లో, జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రముఖంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల పరిశోధనకు కొత్త చట్టాల్లో ప్రాధాన్యమిచ్చారు. ప్రాథమిక దర్యాప్తు నివేదిక సమర్పించిన రెండు మాసాల్లోపు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే విధంగా బాధితులకు ప్రతి 90 రోజులకు ఒకసారి కేసు పురోగతిని వివరించాల్సి ఉంటుంది. సామాజిక సేవను ఒక శిక్షగా గుర్తించడం ప్రశంసనీయమే. శిక్షలు విధించడం ఒక్కటే కాదు, న్యాయం చేయడమూ ముఖ్యమే అన్న సదుద్దేశంతో ఈ మార్పులు తెచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకొన్నది.
అయితే కేంద్రం తెచ్చిన మార్పులన్నీ విమర్శలకు అతీతమైనవేమీ కావు. ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసేందుకు 14 రోజుల సమయం పోలీసులకు ఇవ్వడం అభిలషణీయం కాదు. ఇలాంటి నిబంధనలు పోలీసులకు అపరిమితాధికారాలు కల్పించే ప్రమాదం ఉంటుంది. ఇకపోతే కాలంచెల్లిన రాజద్రోహ నేరం వంటివి తొలగించడం మంచి మార్పే. దాని స్థానంలో దేశ సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత, సమగ్రతకు ముప్పు తెచ్చే కార్యకలాపాలు అంటూ కొత్త నిర్వచనం తగిలించడంపై న్యాయవర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇది రాజద్రోహ నేరానికి మరింతగా విస్తృతార్థం కల్పించడం తప్ప మరొకటి కాదనే విమర్శలూ వినవస్తున్నాయి. ఇది ప్రజాఉద్యమాలు, హక్కులు, పోరాటాల అణచివేతకు దారితీసే ప్రమాదం ఎంతైనా ఉన్నది. వాక్స్వాతంత్య్రానికి ప్రతిబంధకమైన నిబంధనలూ కొత్త చట్టాల్లో ఉన్నాయి. జాతి, కుల, మత వ్యత్యాసాల పేరిట మూకుమ్మడిగా జరిపే ప్రాణాంతక దాడుల విషయంలోనూ స్పష్టత లోపించింది. ఈ నేరానికి ఏడు సంవత్సరాల నుంచి యావజ్జీవం, ఆపై మరణశిక్ష దాకా విధించవచ్చని ఉంది. ఓ దాడిలో 50 మంది పాల్గొంటే అందరికీ మరణశిక్ష విధించడం కుదురుతుందా? అనేది ప్రశ్న.
163 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలకులు భారతీయ న్యాయవ్యవస్థపై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు తెచ్చిన నేరచట్టాల్లో ‘థగ్గుల’ నియంత్రణ, అసభ్యత వంటి అంశాలపై నేటి పరిస్థితుల్లో అర్థరహితంగా కనిపించే అనేక నిబంధనలు ఉండేవి. అలాంటివి తొలగించినప్పటికీ 80 శాతానికి పైగా నిబంధనలు పాతవాటిలో ఉన్నవే. చాలా పాత నిబంధనలు పేర్లు లేదా సంఖ్యలు మార్చుకుని కొత్త చట్టాల్లో కొత్తరూపంలో ఒదిగిపోయాయి. ఐపీసీలోని 420 సెక్షన్ కొత్త ‘సంహిత’లో 318గా మారిపోయింది.
కొత్త పేర్లు, సంఖ్యలకు అలవాటు పడటం న్యాయవృత్తిలో ఉన్నవారికి ఇబ్బంది కలిగించే అంశమే. పాతవి మరిచిపోయి కొత్తవి కంఠస్తం చేయడం న్యాయవాదులకు పరీక్షే. సర్దుబాటుకు కొంత సమయం పడుతుంది. కొత్త చట్టాలపై అవగాహనకు వర్క్షాపులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వ ఆచారం ప్రకారం కొత్త చట్టాలకు హిందీలో నోరు తిరగని పేర్లు పెట్టడంపై దక్షిణాదిలో, ముఖ్యంగా తమిళనాడులో అసంతృప్తి వ్యక్తమైనది. ఆ సంగతి అలా ఉంచితే ఆధునిక జీవన సరళి, కొంగొత్త సాంకేతికతకు అనుగుణమైన మార్పులు ప్రవేశపెట్టడం ప్రశంసనీయం.