దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది మెడికల్ కాలేజీలు.. ప్రారంభం కానున్నాయి. వెరసి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఒక ప్రభుత్వ వైద్యుడిగా ఉద్విగ్నం చెందే సందర్భం ఇది. ప్రజల ఆరోగ్యమే దేశానికి సౌభాగ్యం. అది నెరవేర్చడం ప్రభుత్వాల కర్తవ్యమని మహాత్మా గాంధీజీ చెప్పారు. ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండటం శుభపరిణామం.
పదేండ్ల కిందట తెలంగాణకు వైద్యరంగంలో కేటాయించిన సొమ్ము రూ.14,752 కోట్లు. అయితే ప్రస్తుత తెలంగాణ పాలనలో వైద్యంపై చేసిన కేటాయింపు దాదాపు రూ.73,888 కోట్లు. స్వరాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం మూడంచెల వైద్యవ్యవస్థను ఐదంచెలుగా మార్చింది. 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశం ఇంకా మూడంచెల వ్యవస్థనే అనుసరిస్తే, తొమ్మిదేండ్ల తెలంగాణ ముందు చూపుతో వ్యవహరించి ఐదంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అమలుచేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి మూడు మెడికల్ కాలేజీలు ఉండేవి. ఉస్మానియా మెడికల్ కాలేజీ 1856లో ప్రారంభమైంది. గాంధీ దవాఖాన 1954లో ప్రజల చందాలతో పీపుల్స్ మెడికల్ కాలేజీగా ప్రారంభం కాగా, కాకతీయ మెడికల్ కాలేజీని 1959లో వరంగల్ రీజినల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రారంభించింది. ‘నాలుగు జిల్లాలున్న రాయలసీమలో నాలుగు మెడికల్ కాలేజీలున్నాయి. పది జిల్లాలున్న తెలంగాణలో మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మంత్రులు ఏం చేస్తున్నారు. ఇదేనా తెలంగాణ అభివృద్ధి అంటే?’ అని 2008, మార్చి 4న ఇదే అసెంబ్లీలో ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెడికల్ కాలేజీల గురించి నిండు సభలో ప్రశ్నించారు. ఉద్యమిస్తే నాడు ఆదిలాబాద్ (2008), నిజామాబాద్ మెడికల్ కాలేజీ 2013లో ఏర్పాటయ్యాయి. అలాంటి పరిస్థితి నుంచి నేడు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటుచేసుకొనే స్థితికి చేరింది తెలంగాణ. 60 ఏండ్లలో రెండు మెడికల్ కాలేజీలు ఉంటే, తొమ్మి దేండ్లలో 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసి చరిత్ర సృష్టించారు సీఎం కేసీఆర్.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ దవాఖానల్లోనే అందుబాటులో ఉండే ప్రపంచస్థాయి రొబోటిక్ వైద్యసేవలను నిమ్స్, ఎంఎన్జే దవాఖానలకూ విస్తరించింది. తద్వారా పేద ప్రజలకు ఉచితంగా అత్యున్నత, అధునాతన వైద్య సేవలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ నిమ్స్ అభివృద్ధి కోసం ఇటీవల రూ.156 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయం. తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ వంటి హైదరాబాద్ ప్రజల వైద్య అవసరాలు తీర్చేలా జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లకు 6 డీఎంహెచ్వో పోస్టులను ప్రభుత్వం మంజూరుచేసింది.
గాంధీలో ఫెర్టిలిటీ సెంటర్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయి. గాంధీ, నిమ్స్, అల్వాల్లో సూపర్స్పెషాలిటీ ఎంసీహెచ్లు నిర్మాణదశలో ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటయ్యాయి. అన్నిరంగాల్లో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ను అధునాతన వైద్యసేవలకు కేరాఫ్ అడ్రస్గా మార్చేందుకు, మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటం విశేషం.
2015లో సీఎం కేసీఆర్ ఉస్మానియా దవాఖానను సందర్శించి, కొత్త భవనం నిర్మిస్తామని ప్రకటించారు. గిట్టనివారు కొందరు కోర్టుకు వెళ్లడంతో అది ఆలస్యమవుతున్నది. చారిత్రక ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. హైకోర్టు ఆదేశాల మేరకు దవాఖాన ప్రాంత ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, ఇప్పటికే అఫిడవిట్ రూపం లో అందరి సమ్మతిని కోర్టుకు విన్నవించింది. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే 2000 పడకల ఉస్మానియా నూతన బిల్డింగ్ నిర్మాణం చేస్తామని ప్రభుత్వం ప్రకటించటం ఆహ్వానించదగిన పరిణామం.
జిల్లాకో మెడికల్ కాలేజీ. తద్వారా దేశ వైద్యరంగ చరిత్రలో తెలంగాణ అనితర సాధ్యమైన రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుచేసిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ప్రారంభించబోతున్నది. ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోబోతున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పది వేలకు చేరువ కానుండటం హర్షించదగిన విషయం.
(వ్యాసకర్త: ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్)
-డా.కేసగాని రాజశేఖర్ గౌడ్
98484 80890