రిజర్వేషన్ల పెంపుపై పాట్నా హైకోర్టు తీర్పుతో ఈ అంశం మరోసారి దేశంలో చర్చాంశమైంది. బీహార్లోని నితీశ్కుమార్ ప్రభుత్వం కులాల సర్వే ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ గతేడాది చట్ట సవరణ తెచ్చింది. రిజర్వేషన్ పరిధిలోని ప్రతి క్యాటగిరీకి తలా ఇంత పెంచడం వల్ల మొత్తం రిజర్వేషన్ల శాతం 65 శాతానికి చేరింది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ పాట్నా హైకోర్టు ఈ పెంపును కొట్టివేసింది. చట్ట సవరణ ప్రవేశికలో పేర్కొన్న ‘దామాషా సమానత్వం’ అన్న అంశాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు. ‘తగినంత ప్రాతినిధ్యం’ అంటే ‘దామాషా ప్రాతినిధ్యం’ కాదన్న పిటిషనర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది. రాష్ట్ర జనాభాను బట్టి దామాషాగా రిజర్వేషన్లు ఇస్తూ పోతే వాటి మొత్తం శాతం ఆమోదిత పరిమితిని దాటిపోతుంది. తద్వారా న్యాయవ్యవస్థ చేతిలో రద్దుకు గురయ్యే అవకాశం ఏర్పడుతుందనేది పాట్నా హైకోర్టు తీర్పు సారాంశంగా తీసుకోవచ్చు.
మన దేశంలో రిజర్వేషన్ల పరిమితిపై చాలాకాలంగా వివాదం నలుగుతూనే ఉన్నది. రాష్ర్టాలు తమ తమ ప్రత్యేక పరిస్థితులను బట్టి పరిమితికి మించి రిజర్వేషన్లు ఇచ్చేందుకు కృషి చేయడం కొత్తకాదు. ఆ ప్రత్యేక పరిస్థితులు ఏమిటన్న దాని మీద న్యాయ నిర్ణయం ఆధారపడుతున్నది. తెలంగాణలో ముస్లింలలో వెనుకబడిన వర్గాల కోసం 4 నుంచి 12 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్ 6 నుంచి 10 శాతానికి పెంచడం వల్ల రిజర్వేషన్ల మొత్తం శాతం 62కు పెరిగింది. కానీ ఈ పెరుగుదలకు సంబంధించిన చట్టసవరణ కేంద్రం దగ్గరే పెడింగ్లో ఉండిపోయింది. వెనుకబడిన రాష్ట్రమైన బీహార్లో ప్రత్యేక పరిస్థితులు అనే వాదాన్ని తిరస్కరించి, కోటా పరిమితి వైపే కోర్టు మొగ్గు చూపడంతో అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం సమకూర్చాలనే ప్రభుత్వ నిర్ణయానికి గండిపడింది.
చివరగా అందుబాటులోకి వచ్చిన గణాంకాల ప్రకారం మన దేశం లో దళిత బహుజన వర్గాలు 80 శాతం వరకు ఉంటాయి. రిజర్వేషన్లు మాత్రం 50 శాతం పరిమితికి లోబడి ఉండాలని 1992లో వెలువడిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తెలియజేస్తున్నాయి. సమానావకాశాల సూత్రాన్ని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసినప్పటికీ 50 శాతం పరిమితికి ఎలా వచ్చారన్నది తెలియడం లేదు. కేంద్ర, లేదా రాష్ర్టాల శాసనసభలు ఈ విషయమై ఎలాంటి తీర్మానాలు చేసిన దాఖలాలు లేవు. వెనుకబడినవర్గాల ఉద్యమకారులు మొదటినుంచీ ఈ పరిమితిని వ్యతిరేకిస్తున్నారు. వెనుకబడిన వర్గాల రాజకీయ సంస్కృతి ప్రబలంగా ఉన్న తమిళనాడు 69 శాతం రిజర్వేషన్లతో పరిమితికి సవాలు విసిరింది. కేంద్రం కూడా 2019లో అగ్రవర్ణాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 10 శాతం కోటాతో పరిమితి దాటేసింది. దీనిపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానాలు విచారణకు స్వీకరించినప్పటికీ కోటాపై స్టే ఇవ్వలేదు. కానీ కొన్ని ఇతర రాష్ర్టాల విషయంలో పరిమితి పేరు చెప్పి అదనపు రిజర్వేషన్లను కోర్టు కొట్టేసింది. ఈ 50 శాతం కోటా పరిమితిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అంతిమంగా శాసనపరమైన నిర్ణయం జరిగితే పరిమితి అడ్డంకి తొలగిపోయి సామాజిక న్యాయానికి దారి సుగమం అవుతుంది.