‘నీట్’ వ్యవహారం మరువకముందే యూజీసీ- నెట్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వర్సిటీల్లో రీసెర్చ్ ఫెలోషిప్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అర్హత పరీక్షగా నిర్వహించే నెట్ ఈసారి ఆఫ్లైన్లో నిర్వహించారు. ఆరోపణలు వచ్చిన తెల్లవారే ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఎన్టీయే ప్రకటించింది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.6-8 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. 20 రోజుల వ్యవధిలో ఎన్టీయే నిర్వహించిన రెండు జాతీయ స్థాయి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
దేశంలోని అన్ని వర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించిన పీహెచ్డీ ప్రవేశాలకు నెట్ పరీక్షలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకోవాలని యూజీసీ నిర్ణయిం చింది. గతంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ వర్సిటీల్లోనే ఈ నిబంధన అమలులో ఉండేది. యూజీసీ నిర్ణయం, నెట్ పేపర్ లీకేజీ వెనుక బీజేపీ ప్రభుత్వ కుట్రలు దాగి ఉన్నట్టు అనుమానాలు వస్తు న్నాయి. తమ పార్టీ భావాలు గల విద్యా ర్థులకు వర్సిటీల్లో పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించి, తద్వారా తమకనుకూలంగా ఉన్న పరిశోధనలను ప్రోత్సహించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపణలున్నాయి. బీజేపీ ఇప్పటికే నూతన జాతీయ విద్యావిధానం ద్వారా విద్యను పూర్తిగా కాషాయీకరణ చేసి, అశాస్త్రీయ భావాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. అంతేకాదు, జీవ పరిణామ సిద్ధాంతం, పిరియాడిక్ టేబుల్, అంబేద్కర్, భగత్సింగ్ తదితర అంశాలను తొలగించి, అదే సమయంలో మనుస్మృతి, సావర్కర్, గోల్వాల్కర్ చరిత్రను పాఠ్యాంశాల్లో జొప్పిస్తున్నది.
నీట్, జేఈఈ (మెయిన్స్), సీ- మ్యాట్, యూజీసీ-నెట్ తదితర పరీక్షలు ఎన్టీయే ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఎన్టీయేను ఆర్ఎస్ఎస్ భావాలున్న వారితో, తమకనుకూలంగా ఉండేవారితో కేంద్ర ప్రభుత్వం నింపేసింది. వారి ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని బీజేపీ ప్రభుత్వం చూస్తున్నది. నీట్, నెట్ పరీక్షల నిర్వహణలో ఎన్టీయే విఫలమైంది. ఈ నేపథ్యంలో ఎన్టీయేను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. అంతేకాదు, ప్రధాని మోదీ నైతిక బాధ్యత వహిస్తూ బాధిత విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. దాంతో పాటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించి విద్యార్థులకు అండగా నిలవాలి.
– కంచనపల్లి శ్రీను