యూపీలో పెద్దఎత్తున సత్సంగ్ భక్తుల మృతికి కారణమైన హాథ్రస్ దుర్ఘటన మన దేశంలోని వ్యవస్థల పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. నిర్వాహకుల నేరపూరిత నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతున్నది. మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ అనేది దైవాధీనంగా ఉండిపోవడాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తున్నది. బాబా నారాయణ్ హరి (సాకర్ విశ్వహరి భోలే బాబా) అనే ఆధ్యాత్మికవేత్త నిర్వహించిన సత్సంగ్లో 120 మందికిపైగా భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వందలాది మంది గాయపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. బాబా అనుగ్రహ భాషణం ముగించుకొని వెళ్లిపోతుండగా భక్తులు ఒక్కసారిగా ఆయన ఆశీస్సుల కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందంటున్నారు. హాథ్రస్కు 47 కిలోమీటర్ల దూరంలోని ఫూల్రాయ్ గ్రామ సమీపంలో ఎగుడుదిగుడుగా ఉండే పొలాల్లో తాత్కాలికంగా టెంట్లు వేసి, భారీ ఎత్తున జనాన్ని పోగేసిన నిర్వాహకులు అందుకు అవసరమైన రీతిలో భద్రత, వైద్య సదుపాయాలు కల్పించలేదని స్పష్టంగా తెలుస్తున్నది. కనీస జాగ్రత్తలు కూడా పాటించలేదని ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి.
80 వేల మందితో సత్సంగ్ నిర్వహణకు అధికారుల నుంచి అనుమతి తీసుకుంటే సుమారు రెండున్నర లక్షల మంది హాజరయ్యారని ఒక అంచనా. భారీ సంఖ్యలో జనం హాజరైన సమావేశానికి కేవలం 70 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఘటనాస్థలంలో కేవలం ఒకే ఒక వైద్యుడు అందుబాటులో ఉండటం నిర్వాహకుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. నిర్వాహకుల లెక్కలేని తనానికి అధికారుల నిర్లక్ష్యం కూడా తోడవడంతో అమాయకులు బలైపోయారు. సత్సంగ్ నిర్వహించిన మనావ్ మంగల్ మిలాన్ సద్భావన సగమం కమిటీ బాధ్యులను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులకు అందిన ఫిర్యాదులో బాబా పేరు ఉన్నప్పటికీ ఎఫ్ఐఆర్లో ఆయనను నిందితునిగా చేర్చకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనేక మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత బాబా పరారీలో ఉండటంపైనా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
మన దేశంలో మతపరమైన ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగి పెద్దఎత్తున ప్రాణాలు కోల్పోయే సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. ఇలాంటివి చోటుచేసుకున్నప్పుడు నేతలు సంతాపం ప్రకటించడం, మృతుల కుటుంబాలకు సాయం అందజేసి చేతులు దులిపేసుకోవడం షరా మామూలే. నిర్వాహకుల తీరులో ఎలాంటి మార్పు రాదు. అనుమతులు, పర్యవేక్షణ విషయంలో అధికారుల నిర్లక్ష్యమూ మారదు. కేసులు నమోదు చేసి విచారణలు చేపట్టినప్పటికీ నిందితులకు శిక్షలు పడిన దాఖలాలూ తక్కువే. ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించిన నిర్దిష్టమైన నియమ నిబంధనలు, విధివిధానాలు లేకపోవడం పెద్ద సమస్య. జవాబుదారీతనం కట్టుదిట్టంగా ఉండదు. దీనిని ఎత్తిచూపుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడం గమనార్హం. హాథ్రస్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని పిటిషనర్ కోరారు. సర్వోన్నత న్యాయస్థానం చొరవతోనైనా తగిన పర్యవేక్షణా వ్యవస్థ ఏర్పడితే అమాయకుల ప్రాణాలకు రక్షణ కలుగుతుంది.