నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయ్యాయని సామెత. ఏదో వెలగబెడతారని కాంగ్రెస్కు అధికారమిస్తే చీకట్ల పాల్జేశారని జనం నివ్వెరపోతున్నారు. కరెంటు కోతలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. కానీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాత్రం కనురెప్ప పాటు కూడా కరెంటు పోవడం లేదని సెలవిస్తున్నారు. ఆయన మాటలు హాస్యాస్పదంగా ధ్వనిస్తున్నాయి. కరెంటు కోతలకు నిరసనగా ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. పొలాలను ట్యాంకర్ల నీటితో తడుపుకొంటూ రైతులు నానా తంటాలు పడుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లోనే కరెంటు పోయి అభాసుపాలవుతున్నారు. పోలీసు భద్రతతో పాటుగా కరెంటు పోతే సత్వరమే చర్యలు తీసుకునేందుకు డిస్కం అధికారులను కూడా సంసిద్ధంగా ఉంచుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం ఉన్న మాట అంటే ఉలిక్కి పడుతున్నది. కోతలపై నిరసన తెలిపేవారి ఇండ్ల మీదకు విద్యుత్తు సిబ్బందిని పంపి ధర్నాలు చేయిస్తున్నది. సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలను సామాజిక మాధ్యమం ద్వారా వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ఓ మహిళా జర్నలిస్టుపై కేసు పెట్టడం ప్రభుత్వ నిస్పృహకు పరాకాష్ఠ. తీగలపై తొండలు పడటం వల్ల కరెంటు పోతున్నదనే వాదన విస్మయం కలిగిస్తున్నది.
సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఏదోరకంగా వివాదాలు సృష్టించాలని చూస్తున్నది. నిన్నటి పాలకులను వేధించే పనిలో తలమునకలుగా ఉన్నది. నానా తంటాలు పడి పొరుగు రాష్ట్రం నుంచి కొనుగోలు చేసి 24 గంటలు నాణ్యమైన కరెంటు సరఫరా చేసిన బీఆర్ఎస్ సర్కారుపై దుమ్మెత్తి పోయాలని చూస్తున్నది. విచారణ కమిషన్ల పేరిట వేధించాలని ఎత్తులు వేస్తున్నది. నీళ్లు, కరెంటు సరఫరా మెరుగుపర్చడం అనేవి కేసీఆర్ పాలనకు ముద్రలుగా మిగిలిపోయాయి. ఇవి ప్రజలకు ప్రత్యక్షంగా అనుభూతమైనవే. ఇప్పుడు మారిన పరిస్థితిలో ఆ ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం నీళ్లు, కరెంటునే లక్ష్యంగా చేసుకొని ఇదివరకటి సర్కారును ఏదోరకంగా బదనాం చేయాలని చూడటం విచిత్రం. అందుకు నానా కుట్రలు పన్నుతున్నది. ప్రభుత్వాల స్థాయిలో కుదిరిన ఒప్పందాలపై, ప్రభుత్వరంగ సంస్థలకు ఇచ్చిన ఆర్డర్లపై అనుమానాలు రేకెత్తించాలని చూస్తున్నది. వితండ వాదాలతో వివాదాలు సృష్టించేందుకు అవస్థలు పడుతున్నది.
కరెంటు సరఫరా విషయంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వం చెప్తున్నట్టుగా మిగులు కరెంటు ఉంటే కోతలు ఎందుకు తలెత్తుతున్నాయి? పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా సరఫరాకు ఇబ్బంది ఉండబోదని అంటున్నారు. ఇంకా ఒకడుగు ముందుకువేసి 24 గంటలు ఉచిత సరఫరా చేస్తామంటున్నారు. కొత్త విద్యుత్తు విధానం తెస్తామని బీరాలు పలుకుతున్నారు. ఏం చేస్తున్నావే కోడలా అంటే పారబోసి ఎత్తుకుంటున్నా అత్తా అన్నట్టుగా బీఆర్ఎస్ హయాంలో మెరుగుపడిన కరెంటు సరఫరాను ఆగం చేసినోళ్లే ఏదో ఊడబొడుస్తామన్నట్టు మాట్లాడటం వింత. ఆగమాగం చేసి అధికారంలోకి రావడం సరే. పరిపాలనా సామర్థ్యం దగ్గర కాంగ్రెస్ నేతల పస బయటపడుతున్నది. దీంతో వివాదాల మాటున తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ, ప్రజల ప్రత్యక్షానుభవానికి సంబంధించిన విషయాలను మసిపూసి మారేడు కాయ చేయాలనుకోవడం అత్యాశేనని కాంగ్రెస్ పాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
మొదట్నుంచీ మొత్తుకుంటూనే ఉన్నాం!
పాట్నా హైకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ల తీర్పుపై సీఎం నితీశ్కుమార్ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. మోదీ కాళ్లపై పడైనా సరే రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో రిజర్వేషన్లను చేర్పించాలి.
– తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత