అధికారం మీద యావతో కాంగ్రెస్ పార్టీ శతానేక హామీలిచ్చి జనాన్ని మాయచేసింది. అందులో రెండు లక్షల ఉద్యోగాలిస్తామనేది కీలకమైనది. నిరుద్యోగులు ఈ హామీపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఇంకా నమ్మరేమోననే అనుమానంతో ఇదిగో జాబ్ క్యాలెండర్, అదిగో తేదీలంటూ ఊరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తాము చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే ఇచ్చేస్తామని మరికొంత బులిపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పార్టీ పలు పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు కూడా విడుదల చేసింది. నిరుద్యోగుల్లో అనవసరమైన భయాందోళనలు కల్పించి, ఆపై అలవిమాలిన హామీలిచ్చి తమ వైపు తిప్పుకొనేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించింది. కొందరు మేధావులు ఆ సమయంలో కాంగ్రెస్ హామీలకు విశ్వసనీయతను కల్పించేందుకు తంటాలు పడిన సంగతి తెలిసిందే.
రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఏడు మాసాలు కావస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు, ఇతరేతర తంతు పూర్తిచేసి ఎన్నికల కారణంగా వాయిదా వేసిన ఉద్యోగాల పత్రాలను అట్టహాసంగా అందజేసి ప్రభుత్వం తన జబ్బలు చరచుకున్నది. ఆ ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ విడుదల చేసిందీ లేదు, ఉద్యోగాలు భర్తీ చేసిందీ లేదు. మరో ఐదు నెలల్లో గోడ మీది క్యాలెండర్ మారిపోతుంది. జాబ్ క్యాలెండర్ అప్పటికైనా గోడ మీదకు వచ్చే సూచనలు ఇప్పటికైతే కనిపించడం లేదు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగమైన పది నోటిఫికేషన్ల గడువు ముగిసిపోయింది. జాబ్ క్యాలెండర్ అనేది తమపాలిట క్రూర హాస్యమైందని నిరుద్యోగులు గ్రహించారు.
నమ్మించి నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ సర్కారుపై కదనభేరి మోగించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష సర్కారు వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఇప్పటికీ సర్కారు నిర్దిష్టమైన ప్రణాళికను ప్రకటించకుండా చర్చలంటూ తాత్సారం చేయజూస్తున్నది. గాంధీ దవాఖానలో దీక్ష కొనసాగిస్తున్న మోతీలాల్ వద్దకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను పంపించి పైపై హామీలతో సర్దుబాటు చేసేందుకు జరిపిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సీఎం స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తానని మోతీలాల్ తెగేసి చెప్పడంతో సర్కారు ఇరుకునపడింది.
ఇంత జరుగుతున్నా ఆనాడు రాహుల్గాంధీని అశోక్నగర్ కోచింగ్ సెంటర్లలో తిప్పి హామీలిప్పించిన కోదండరాం వంటి నేతలు పెదవి విప్పకపోవడం గమనార్హం. మరోవైపు బీఆర్ఎస్ సహా పలు పార్టీలు, ప్రజాసంఘాలు నిరుద్యోగుల పోరాటానికి మద్దతు ప్రకటించాయి. రోజురోజుకు ఆందోళనను ఉధృతం చేస్తున్న నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్నది. ఇందుకు ఆయన ముందున్న మార్గాలు రెండు. ఒకటి, ఆలస్యంగానైనా భర్తీ ప్రక్రియకు సరికొత్తగా శ్రీకారం చుట్టడం. రెండు, అమలు చేయలేని హామీలు ఇచ్చినందుకు లెంపలు వేసుకుని క్షమాపణ వేడుకోవడం. ఈలోగా నిరుద్యోగుల ఆందోళన చేయిదాటితే అందుకు పూర్తి జవాబుదారీ సర్కారుదే.