ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ నిరుపేదల్లో నవ కాంతులు నింపుతున్నది. గురువారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం, శుక్రవారం రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. వివిధ సమస్యలతో శిబిరాలకు వస్తున్న వారికి వైద్య సిబ్బంది పరీక్షలు చేసి మందులతో పాటు కళ్లద్దాలు అందిస్తున్నది. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలకు రెఫర్ చేస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సేవలందిస్తుండగా, సర్కారు సల్లంగుండాలంటూ ప్రజానీకం దీవెనలందిస్తున్నది.
ఆదిలాబాద్/నిర్మల్, జనవరి 20(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమం శుక్రవారం రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. మంచిర్యాల కాలేజీ రోడ్లోని డే కేర్ సెంటర్, సంజీవయ్య కాలనీ, అమరావతి, దొనబండ గ్రామాల్లోని శిబిరాలను కలెక్టర్ భారతీ హోళికేరి, అదనపు కలెక్టర్ రాహుల్ పలుచోట్ల శిబిరాలను పరిశీలించారు. జడ్పీచైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మందమర్రిలోని కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కొలిపూర, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి. అంకాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలను కలెక్టర్ సిక్తాపట్నాయక్ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గణేశ్నగర్ మున్నూరుకాపు సంఘం ఫంక్షన్ హాల్, భైంసా జూనియర్ కళాశాల, బాసరలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లాలో పటు చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు శిబిరాలను సందర్శించారు. ఆయా చోట్ల అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు ఉన్నారు. ఇక ఊరూరా ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
పేర్లు నమోదు చేసుకొని.. క్యూ.. ప్రకారం పరీక్షలు చేయించుకుంటున్నారు. దూరపు చూపు, దగ్గరి చూపు లోపం, కళ్లలో పొరలు రావడంవంటి సమస్యలున్న వారికి మందులు అందించడంతో పాటు కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నారు. ఇక శస్త్ర చికిత్సలు అవసరమైన వారు వైద్యుల సూచనల మేరకు సిద్ధమవుతున్నారు. కాగా, ‘నమస్తే తెలంగాణ’ ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించి పలువురిని పలకరించగా, తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రూపాయి ఖర్చులేకుండా వైద్య సేవలు అందిస్తున్న గీ సర్కారు సల్లంగుండాలే అంటూ దీవెనలు అందించారు.
కోటపల్లి, జనవరి 20 : నాకు 65 ఏండ్లుంటయ్. ఏడాదైతంది కండ్లు మస్క అయి. దగ్గరున్నోళ్లే అట్లట్ల కనిపిస్తన్రు. దవాఖాన మస్తు దూరమని ఇన్ని రోజుల సంది పోలే. మంచిర్యాల మాకు 90 కిలోమీటర్లు ఉంటుంది. పక్కనే మహారాష్ట్ర ఉంది. కానీ అక్కడ హాస్పిటళ్లు లేవు. ఇగ నా కండ్లు గింతే అనుకున్న. కష్టమో నష్టమో ఇగ బతికినన్ని రోజులు వెళ్లదీద్దమను కున్న. ఇంతల్నే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తన్రు. మా ఊరిలో క్యాంపు పెడుతున్రని డప్పు చాటింపు చేసిన్రు. అందుకే పొద్దుగాల్నే లేసి వచ్చిన. పరీక్ష చేసిన్రు. అద్దాలు పెట్టి చూసిన్రు. కండ్లు మంచిగ కనిపించినయ్. పైసా ఖర్సు లేకుండా పరీక్షలు చేసిన్రు. రేపో మాపో అద్దాలిస్తమని చెప్పిన్రు. గదే ప్రైవేట్ దవాఖానకు పోతే వేలకు వేలు ఖర్సయ్యేటివి. ఇక్కడ రూపాయి కూడా తీసుకోలే. గింత మంచి సర్కారును బతికున్నంత కాలం తల్సుకుంట.
– శంకరమ్మ, వెంచపల్లి
నిర్మల్ పట్టణంలోని గొల్లపేట్ కాలనీలో నివాసం ఉండే సిద్ద భూమవ్వది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. భర్త మల్లయ్య కూలీ పనులు చేస్తుండగా, భూమవ్వ బీడీలు చుడుతూ జీవిస్తున్నది. ముగ్గురు కూతుళ్ల పెండ్లిళ్లు చేసింది. ఐదారేండ్లుగా కండ్లు మసకబారడంతో మొదటి విడుత కంటివెలుగులో పరీక్షలు చేయించుకున్నది. అప్పట్లో ఇచ్చిన కంటి అద్దాలు ఆరు నెలల క్రితం కిందపడి పగిలి పోవడంతో కొత్తవి కొనే స్థోమత లేక అలాగే నెట్టుకొస్తున్నాని తెలిపింది. సీఎం సారు మళ్లీ కంటివెలుగు కార్యక్రమాన్ని నా కోసమే పెట్టినట్లు అనిపిస్తున్నదని భూమవ్వ సంతోషం వ్యక్తం చేస్తున్నది. శుక్రవారం తన ఇంటి సమీపంలోనే ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకున్న భూమవ్వకు వైద్యులు గోలీలు, చుక్కల మందు ఇచ్చారు. ఎడమ కంటికి పొర వచ్చిందని, ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారు. పేదల బాగోగులు చూస్తున్న సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నది.
-సిద్ధ భూమవ్వ, గొల్లపేట్, నిర్మల్
నాకు చాలా రోజులుగా కంటి చూపు సమస్య ఉన్నది. నా భార్య రాణికి కూడా ఇదే సమస్య. అప్పట్లో మొదటి విడుత కంటివెలుగులో ఇద్దరం పరీక్షలు చేయించుకున్నం. సమస్యను గుర్తించిన వైద్యులు అద్దాలు ఇచ్చిన్రు. మళ్లీ ఇప్పుడు కూడా పరీక్షలు చేయించుకున్న. రెండోసారి కూడా కంటి అద్దాలు ఇచ్చిన్రు. రేపు మా రాణిని కూడా తీసుకొచ్చి పరీక్షలు చేయిస్త. చాలా మంది పేదలు ఖర్చుల భారంతో కంటి వైద్యం చేయించుకోలేక అలాగే వదిలేస్తరు. అలాంటి వారికోసం ఇంటి దగ్గరకే వచ్చి వైద్యం అందించడం నిజంగా గొప్ప విషయం. పేదల కళ్లల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ను ఎప్పటికీ మరువం.
-సాయన్న, ఆటో డ్రైవర్, నిర్మల్
ఎనిమిదేళ్ల క్రితం నా భర్త లింగన్న అనారోగ్యంతో చనిపోయిండు. నా ఇద్దరు కొడుకులు పెండ్లిళ్లు చేసుకొని ఎవరికి వారు కుటుంబాలతో ఉంట్నురు. నేను ఒక్కదాన్నే ఉంటున్న. ప్రభుత్వం వితంతు పింఛన్ ఇస్తున్నది. పదేళ్లుగా కంటి చూపు మందగించింది. దవాఖాన పోతే పైసలెక్కువయితయని పోలే. సర్కారోళ్లు పెట్టిన కంటివెలుగు కార్యక్రమం నా జీవితానికి వెలుగు రేఖయ్యింది. మొదటి విడుతలో కంటి అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు మళ్లీ పరీక్షలు చేయించుకునేందుకు ఊర్ల పెట్టిన శిబిరానికి వచ్చిన. డాక్టర్లు టెస్టులు చేసి, అద్దాల కోసం ఆర్డర్ పెట్టిన్రు. వారం, పది రోజుల్లో రాంగనే ఆశ కార్యకర్త ఇంటికే తెచ్చి ఇస్తానని చెప్పింది. పేదోళ్ల జీవితాలకు కేసీఆరే పెద్ద దిక్కు. ఆయన దేవునసంటోడు.
– సంద లక్ష్మి, గొల్లపేట్, నిర్మల్
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న కంటి వెలుగు చాలా గొప్ప కార్యక్రమం. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మాది ఐదో వార్డు. ఇక్కడే యూత్ ట్రైనింగ్ సెంటర్లో శిబిరం నిర్వహిస్తున్నరు. మా వార్డులో 2600 మంది ఉన్నారు. అందిరికీ కంటి పరీక్షలు జరిగేలా చూస్త. ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ఆహ్వాన పత్రికలు ఇచ్చా. శిబిరానికి వచ్చే వారు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసిన్రు. ఇక్కడికి వచ్చిన వారికి సహాయ, సహకారాలు అందిస్తూ కంటి పరీక్షలు జరిగేలా చూస్తున్న.
-రామెల్లి శ్రీలత, కౌన్సిలర్, ఐదోవార్డు, ఆదిలాబాద్ మున్సిపాలిటీ
నాకు కొన్ని రోజుల నుంచి ఎడమ కన్ను సరిగా కనపడతలేదు. కండ్ల పరీక్షలు చేయించు కుందామని శిబిరానికి వచ్చిన. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నయ్. పేర్లు రాసుకొని డాక్టర్లు మిషన్లతో కండ్ల పరీక్షలు చేస్తున్నరు. గరీబోళ్ల కోసం కంటి వెలుగు కార్యక్రమం పెట్టుడు మంచి నిర్ణయం. డాక్టర్లే ఊళ్లకు, వాడలకు అచ్చి కండ్ల పరీక్షలు చేసుడు మంచిగున్నది. మా వాడలో అందరూ ఈ పరీక్షలు చేయించుకుంటున్నరు. పేదలకు ఇలా ఉచితంగా కంటి చికిత్సలు చేయించడం ఇలా గతంలో ఎన్నడూ సూడలె.
-శాంతాబాయి. ఐదోవార్డు, ఆదిలాబాద్
నాకు 73 ఏండ్లు. రాత్రిపూట చూపు సరిగా ఉండదు. చాలా తిప్పలైతంది. అందుకే కేసీఆర్ సారు పంపిన డాక్టర్లకు సూపెట్టుకుందామని వచ్చిన. డాక్టర్లు టెస్టులు చేసి, అద్దాలు, మందులు ఇచ్చిన్రు. ఇగ పేదోళ్లకు ఇలా శిబిరాలు పెట్టి కంటి సూపు తెప్పించుడు మంచిగున్నది. నాలాంటి ముసలోళ్లకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతది. సీఎం కేసీఆర్ సారు సల్లంగుండాలె.- నాగమ్మ, శ్రీరాం కాలనీ, ఆదిలాబాద్
మా ఊరిలో నిన్నటి నుంచి క్యాంపు నడుస్తంది. కండ్లు మస్కగా కనిస్తున్నయ్. గందుకే ఇయ్యాల ఇక్కడికి వచ్చి డాక్టర్లకు సూపించుకున్న. సార్లు కండ్లకు మంచిగా పరీక్షలు చేసిన్రు. పొరలు వచ్చినయని, కంటి పాపలకు మోతి చుక్కలచ్చినయని చెప్పిన్రు. ఇంకో 20 రోజుల్లో నా అసొంటోళ్లందరికి కలిపి బెల్లంపల్లిలో క్యాంపు పెడ్తరట. గప్పుడు సర్కారోళ్లు వచ్చి నన్ను ఆపరేషన్కు తీసుకెళ్తరట. క్యాంపు పెట్టిన సంగతి చెప్తమని ఫోన్ నంబర్ తీసుకున్నరు. ఆపరేషన్ చేస్తే ఇగ నా కండ్లు మంచిగా కనబడ్తయ్. గీ క్యాంపు పెట్టిస్తున్న కేసీఆర్ సారుకు చేతులెత్తి మొక్కుతున్న.
– సంకరి బుచ్చమ్మ, వృద్ధురాలు, బెజ్జూర్
నాకు మస్తు రోజులైతంది. కండ్లు సరిగా కనిపిస్తలేవు. ప్రైవేటు దావాఖానకు పోయి సూపించుకుందామంటే డబ్బులు లేకుండె. ఇప్పుడు మా ఊరిలోనే కంటి వెలుగు శిబిరం పెట్టిన్రు. ఇయ్యాల పరీక్షలు చేయించుకున్న. నా కండ్లను పరీక్షించిన డాక్టర్లు కండ్లద్దాలిచ్చిన్రు. ఇప్పుడు మస్తు మంచిగ కనిపిస్తున్నయ్. నాలాగే మస్తు మందికి పరీక్షలు చేసి మందులతో పాటు అద్దాలు కూడా ఇచ్చిన్రు. పైసా ఖర్చు లేకుండా వైద్యం చేసిన గీ సర్కారుకు రుణపడి ఉంట.
ప్రభుత్వం ఊరూరా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి మాలాంటి పేదోళ్లకు కండ్ల పరీక్షలు చేస్తుంది. ఇంత మంచి పని చేసినోళ్లను నేను ఇప్పటిదాకా సూడలే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేదోళ్లకు మంచి చేస్తున్నరు. నాకు కండ్లు మస్కగా కనిపిస్తున్నయని ఇయ్యాల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకున్న. అద్దాలు రాసిచ్చిన్రు. ప్రైవేట్ దవాఖానకు పోతే వేలకు వేలు ఖర్సయ్యేటివి. ఇక్కడ రూపాయి కూడా తీసుకోలే. ఇందుకు చాలా సంతోషంగా ఉంది.
– పరితోష్ మండల్, రవీంద్రనగర్, చింతలమానేపల్లి
సీఎం కేసీఆర్ సారు పేదల ఆరోగ్యం విషయంలో మంచి సౌలతులు చేస్తున్నడు. సర్కారు దవాఖానలకు పోతే అన్ని రోగాలకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తున్నరు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేస్తున్నరు. గరీబోళ్లు ప్రైవేటు దవాఖానలకు పోవాలంటే అప్పో సప్పో జెయ్యాలే. అక్కడ వేసే బిల్లులకు ఉన్నదంతా అమ్ముకోవాలే. అసోంటి రోజులే ఇవి. కంటి సూపు మందగించినా, పైసలయితయని చానా మంది దవాఖానలకు పోతలేరు. కేసీఆర్ సారు పేదోళ్ల గురించి ఆలోచించి ఈ పరీక్షలు చేయిస్తున్నరు. నాకు దూరం కంటిచూపు మంచిగ లేదు. ఐదో వార్డులో ఏర్పాటు చేసిన శిబిరంలో పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు పరీక్షలు చేసి దూరం చూపు అద్దాలు అవసరమవుతాయని చెప్పిండ్రు.
-జీ బాపురావు, శ్రీరాంకాలనీ, ఆదిలాబాద్
తాండూరు, జనవరి 20 : ప్రజలకు సేవ చేసుట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సారును మించినోళ్లు లేరు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తన్రు. దేవునోలే ఆదుకుంటున్నడు. మాది పేద కుటుంబం. నేను కార్పెంటర్గా పని చేస్త. నాకు చాలా ఏండ్ల సంది కంటి సమస్య ఉంది. డబ్బులు సరిగా లేక పరీక్ష చేయించుకోలేదు. 2018 ఆగస్టులో కంటివెలుగులో పరీక్షలు చేయించుకొని అద్దాలు తీసుకున్న. అద్దాలు బాగానే పన్జేసినయ్. మస్తు రోజులైతంది కదా గందుకే సూపులో మళ్లీ తేడా వచ్చింది. ముఖ్యమంత్రి సారు మళ్లోసారి శిబిరాలు పెడుతున్నడని తెలిసి సంబురపడ్డ. నేను ఈ రోజు కంటి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు మంచిగా చూసి మందులు, అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు కండ్లు మస్తు తేటగా కనిపిస్తున్నాయ్. మాలాంటి పేదోళ్లకు ఇది ఒక వరం. – కస్తూరి బాపు, కాసిపేట, తాండూర్
సన్పూర్, జనవరి 20 : నాపేరు జంగంపల్లి దుర్గయ్య. నా భార్య లక్ష్మి. మేము సీసీసీలోని ఆర్కే-5కాలనీలో ఉంటం. మా సొంతూరు భీమిని మండలం రాంపూర్. నేను సింగరేణిలో పన్జేసి రిటైరయ్యిన. అందరం ఇక్కడే ఉంటున్నం. నా భార్యకు, నాకు కరోనా వచ్చింది. కొద్ది రోజుల సంది కంటి సూపు మందగించింది. దవాఖానకు పోయి సూపించుకున్నం. రూ.2 వేల దాకా ఖర్చు పెట్టినం. మూడేండ్లుగా అవే పాత అద్దాలతో కాలం గడుపుతున్నం. మా లాంటి ఏమిలేనోళ్లకు గవర్నమెంటే దిక్కు. ముఖ్యమంత్రి కేసీఆర్ మా లాంటోళ్లకు దేవుడైండు. మా దగ్గర సూపించు కోవడానికి పైసలు లేవు. కంటి వెలుగు అంటు మా ఇంటికి ఒక మేడం వచ్చింది. గవర్నమెంటోళ్లు రూపాయి తీసుకోకుండా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇస్తన్రని చెప్పింది. ఈ రోజు నేను, నా భార్య నస్పూర్కు వచ్చి సూపిచ్చుకున్నం. డాక్టర్ మా ఇద్దరికీ పరీక్షలు చేసి కండ్లద్దాలు, మందులు ఇచ్చిన్రు. ఇగ మా బాధ పోయింది.
– జంగంపల్లి దుర్గయ్య, లక్ష్మి, సీసీసీ