TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం నుంచి విడుదల చేయనున్నది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించనున్నది. ఇందుకు ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుంది. ఈ మూడురోజుల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా పలు ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ కేటాయించనున్నది.
ఎలక్ట్రానిక్ డిప్లో ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి 22న మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్దేశిత నగదు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకార సేవ టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నది. కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకార సేవల్లో వర్చువల్గా పాల్గొనే భక్తుల కోసం ఈ నెల 21 మధ్యాహ్నం 3 గంటలకు కోటా విడుదల చేయనున్నారు.
అంగప్రదక్షిణం టికెట్లను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టికెట్లు విడుదల చేయనున్నది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నది. తిరుపతి, తిరుమలలో వసతి గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు కోటా విడుదల చేయనున్నది. ఈ టికెట్లను ఆన్లైన్లో ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.