Raksha Bandhan 2024 |ఆడబిడ్డల, అన్నదమ్ముల పండుగ రాఖీ పౌర్ణమి రానే వచ్చింది. ఒకరి క్షేమాన్ని మరొకరు కాంక్షిస్తూ ఏడాదికొకసారి జరుపుకునే సంబరం ఇది. కుడిచేతి మణికట్టుకు కట్టే కంకణం ద్వారా తమ అనుబంధం కలకాలం నిలువాలని కోరుకుంటుంది ఆడబిడ్డ. ఈ సందర్భంగా అన్నదమ్ములు వారికి బట్టలు పెట్టడం, కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. సృష్టిలో రక్త సంబంధాన్ని మించిన ప్రేమానుబంధం మరేది లేదు. అమ్మలోని ప్రేమను, నాన్నలోని బాధ్యతను స్వీకరించే అన్నదమ్ములకు తన ఆడబిడ్డ కట్టే కంకణమే రక్షాబంధన్.
రాఖీ పండుగ గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి?
ఉత్తర భారత దేశం నుంచి దక్షిణానికి ఈ పండుగ వచ్చింది. రాజపుత్రులు ఎక్కువగా ఈ వేడుక జరుపుకునేవారు. తక్షశిల రాజు పురుషోత్తముడికి అలెగ్జాండర్ భార్య రోక్సానా రాఖీ కట్టింది. విశ్వవిజేత కావాలనే తపనతో క్రీ.పూ. 326వ సంవత్సరంలో భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు. అప్పుడు అలెగ్జాండర్తో యుద్ధానికి పురుషోత్తముడు కూడా సిద్ధమవుతాడు. ఆ సమయంలో అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్తను ఎట్టిపరిస్థితుల్లోనూ చంపొద్దని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెడతాడు.
అలాగే బలి చక్రవర్తితో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన ఇంద్రుడు, తన స్వర్గాధిపత్యాన్ని కోల్పోతాడు. పూర్వ వైభవం కోసం విష్ణువు దగ్గరకెళ్లి మొరపెట్టుకునేందుకు సిద్ధమవుతాడు. ఈ తరుణంలో భర్త విజయాన్ని కాంక్షిస్తూ, ఇంద్రుడి భార్య శచీదేవి, ఆదిపరాశక్తిని స్మరిస్తూ కంకణం కడుతుంది. దీంతో యుద్ధంలో ఇంద్రుడు రాక్షసుల్ని అవలీలగా ఓడిస్తాడు. అలా పౌర్ణమి రోజు రక్షగా చేతికి తోరణం కట్టుకోవడం ఆచారంగా మారిందని చెబుతారు. ఈ సంప్రదాయం ప్రకారం అక్కా . . చెల్లెళ్లు సోదరులకు శుభం కలుగాలని రాఖీలు కట్టారు.
యమధర్మరాజుకు ఆయన సోదరి యమునకు రాఖీ కట్టినట్లు మరో కథ ఉంది. అదే విధంగా కౌరవుల చేత జూదంలో ఓడిన పాండవులు ద్రౌపదిని సైతం కోల్పోతారు. దుర్యోధనుడు ఆమెను సభకు పిలిపించి వస్త్రాపహరణానికి పాల్పడినప్పుడు శ్రీకృష్ణుడే కాపాడుతాడు. ద్రౌపది ఒకసారి కృష్ణునికి రాఖీ కట్టినందుకే అలా సోదరి సమానురాలైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
యజ్ఞోపవీతం ..
శ్రావణ పూర్ణిమనే జంధ్యాల పూర్ణిమగా జరుపుకుంటారు. యజ్ఞోపవీతధారణ అధికారం(పెళ్లి అయినవారు) ఉన్న ప్రతి వారు శ్రావణ పూర్ణిమ రోజు మార్చుకుంటారు. ఇదే సందర్భంగా ఉపనయం అయిన బ్రాహ్మణ, వైశ్య, పద్మశాలి పలు సామాజిక వర్గాల చెందిన వారు యజ్ఞోపవీతాలను మార్చుకుంటారు. పాత వాటి స్థానంలో కొత్తవి ధరిస్తారు. పద్మశాలీయులు ఉదయమే జంధ్యాన్ని మార్చుకొని సాయంత్రం వేళ మార్కండేయ స్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తారు.