శ్రీ శుకముని భూజాని పరీక్షిత్తుతో.. రాజా! గోపికలు యశోదని పట్టుకొని దుఃఖం ఆపుకోలేక, యశోదయా- అతులిత కీర్తి, కరుణా శోభితుడైన నంద సుతుని ఉద్దేశించి ఇలా అన్నారు..
సీ॥‘ఎదురు వచ్చిన జాల నెదురుగా జనుదెంతు,
వెదురు వచ్చిన నేడదేల రావు?
చూచిన గృపతోడ జూచుచుందువు నీవు,
సూచిన గనువిచ్చి చూడవేల?
డాసిన నఱలేక డాయంగ వత్తువు,
డాసిన నేటికి డాయవిచట?
జీరిన నోయని చెలరేగి పలుకుదు,
విదియేమి సీరిన నెఱుగ కుంట?
ఆ॥ తలపు సేయు నంత దలపోయు చుందువు
తలపు సేయ నేడు దలప వకట!
యనుచు భక్తి వివశ లాడెడి కైవడి
వ్రేత లెల్ల నాడి వివశలైరి’
‘బాలగోపాలా! మేము ఎదురొస్తే నీవూ బదులుగా మాకు ఎదురొచ్చేవాడివి. కాని ఈనాడు నీవలా రాకుంటివేల? మేము తిలకిస్తే నీవు పులకించి దయతో మమ్ము చూచేవాడివి. ఓ కన్నా! నేడు మేము కన్నార చూచినా, నీవు కనువిచ్చి మమ్ము కనవదేమి? మేము పొంతకు- దగ్గరకు వచ్చిన నీవూ మా చెంతకు చేరే వాడివి. ఇప్పుడు మేము వద్దకు వచ్చినా, ఓ ముద్దుల కృష్ణా! నీవు మా దరికి రావేమి? పిలవగానే ‘ఓ’ అని కులుకుతూ పలికేవాడివే! నేడు మేము నోరారా పిలుస్తున్నా ఓ చిత్తచోరా! దామోదరా! నీవు పలుకవేమి? స్మరించగానే స్ఫురణకు వచ్చే విరించి జనకా! ఈ వేళ మేము వలపు మీర తలచినా నీవు మా తలపు (మనసు)లోకి రావదేల? అకటా!- అయ్యో! ఇదేమి వికటం- విరుద్ధం తండ్రీ!’… అని భక్తితో పరవశించిన వారివలె గోపికలు కదలికలు కోల్పోయి, వెన్నదొంగను వదలి వెనుదిరిగి పోలేకపోయారు. మూలంలోని ‘తత్సౌహృద స్మిత విలోక గిరః స్మరంత్యః’- (గోపికలు నిత్యం, నిరంతరం బాలకృష్ణుని సౌహార్దం- ఉదారమైన చెలిమి, అందమైన మందహాసం, చనువుతో కూడిన చూపులు, మధురమైన మాటలనే స్మరిస్తుంటారు) అన్న ఈ శ్లోక పాదాన్ని గ్రహించి సుశ్లోకుడు పోతన కరుణ, వాత్సల్య రసాలను భక్తితో రంగరించి, సరసోక్తులతో పై సీసాన్ని సింగారించాడు.
‘మడుగులో పడి మనమూ ప్రాణాలు విడుద్దాం’ అంటూ వడిగా అందులో పడబోతున్న యశోదాదులను చూచి బలభద్రుడు ‘తల్లిదండ్రులారా! ముందు చూడబోయే కనువిందు జాడ (తీరు) తెలియక మీరిలా కుందు (దుఃఖపడు)తున్నారు. సందేహించక ఓర్పు వహించి తుది తీర్పు వరకు వేచి చూడండి’ అంటూ కరివేలుపు (కృష్ణుని) బలమెరిగిన సీరి- హలధరుడు తనవారినందరిని వారించాడు. వారిజనేత్రుడు కృష్ణుడు కూడా మానవమాత్రుని వలె ఒక ముహూర్త కాలం మౌనం వహించి ఊరకున్నాడు. నాగారి వాహనుడు సరదాగా అలా కొంతసేపు నాగరాజు వేషాలను బాగా సాగనిచ్చాడు. అంతలోనే తేరుకున్న వానివలె కన్నయ్య ఉన్నట్లుండి తన మేను ఒక్కమారుగా బాగా పెంచాడు. స్వామి బలానికి తాళలేక కాళియుని ఒడలు (శరీరం) కుమిలిపోయి, చుట్టలు పట్టు వదలి వీడిపోయాయి.
పడగలు వేడెక్కి అవయవాలు సడలిపోయాయి. వాడు కరవడం మాని ఆయాసపడుతూ, నిడుపైన (దీర్ఘ) నిట్టూర్పులు విడుస్తూ తలలు నెమ్మదిగా పైకెత్తాడు. ముక్కు రంధ్రాల నుండి నెత్తురు చిమ్ముతుండగా వగ (బాధ)తో దిక్కులు చూస్తూ పొగచూరిన కట్టెవలె తురగలి (తేజస్సు) కోల్పోయి, ఉరగ (సర్ప)రాజు కాళియుడు హరిని వీడి దూరంగా జరిగిపోయాడు. అరవిందాక్షుడు గరుడధ్వజుడు తన చేతితో కాళియుని పడగలపై ఎడాపెడా వడి-వడిగా చరచాడు. ఖగేంద్రు(గరుడు)ని వలె వ్రజేంద్ర చంద్రుడు కృష్ణుడు దుష్ట నాగేంద్రుని దవడల మీద గట్టిగా ఒడిసిపట్టి, వానిని పైకెత్తి గిరగిర తిప్పి విసిరికొట్టాడు. ఆ దెబ్బతో కాళియుని కళ్ల నుండి విషాగ్ని జ్వాలలు వెల్లువలై పెల్లుబికాయి. ఆ క్రూరసర్పంలోని దర్పం సర్వం కర్పూరంలా హరించుకుపోయింది. నాగారి (గరుడ) వాహనుడు శౌరి- జగజెట్టి నందపట్టి రెట్టించిన ఉత్సాహంతో ఉరగరాజు- కాళియునిపై విజృంభించి వీరంగం వేశాడు.
వ్యాస భాగవతంలో ‘అఖిల కలాది గురుర్న నర్త’ (అన్ని విద్యలకు, కళలకు ఆదిగురువైన శ్రీధరుడు కృష్ణుడు నాట్యమాడాడు) అని దిఙ్మాత్రంగా ఉన్న- “కాళియుని ఉత్తమాంగా (శిరస్సు)ల రంగస్థలంపై అనంగజనకుడు, ‘చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి’ అయిన శ్రీకృష్ణుడు సలిపిన నృత్య విలాసాన్ని” ఈ సీస పద్యంలో నిత్య నూతనంగా, సాంగ రూపక అలంకారంలో అంగరంగవైభవంగా రసవత్తరంగా అభివర్ణించాడు మన భక్తకవి పుంగవుడు పోతన!
సీ॥‘ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు,
సరస మృదంగ ఘోషంబు గాగ
సాధు బృందావన చర చంచరీక గా,
నంబు గాయక సుగానంబు గాగ
గలహంస సారస కమనీయ మంజు శ,
బ్దంబులు దాళ శబ్దములు గాగ
దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది,
జనులు సభాసీన జనులు గాగ
తే॥ బద్మ రాగాది రత్న ప్రభాసమాన
మహిత కాళియ ఫణిఫణా మండపమున
నళినలోచన విఖ్యాత నర్తకుండు
నిత్య నైపుణమున బేర్చి నృత్యమాడె’
శుకుడు.. రాజా! పద్మరాగాది రత్న ప్రభలతో భాసించే కాళియుని పడగలే విశాలమైన మంటపం- వేదిక. ఇంపైన కాళిందీ నదిలో కదిలే తరంగాల ధ్వనులే వినసొంపైన మృదంగ ధ్వానా (శబ్దా)లుగా ఆద్య నాట్యాచార్యునికి వాద్య సహకారం అందిస్తున్నాయి. బృందావనంలో ఆనందంగా సంచరించే చంచరీక (తుమ్మెద) బృందాల మధుర ఝంకార నాదాలే గాయక గంధర్వుల మోదభరిత గానం కాగా; కలహంసల, సారసా (బెగ్గురు పక్షు)ల కలకూజితాలే- శ్రావ్యమైన శబ్దాలే తాళ ధ్వనులై అలరించగా; దివి నుండి వేడుకగా వీక్షిస్తున్న యక్ష గంధర్వాది దేవతలు నర్తనశాలలో వర్తమానులై ఉన్న ప్రేక్షక సత్తములు కాగా; ఛద్మ (కపట) బాలకుడు, పద్మాక్షుడు కృష్ణుడు అనే ప్రఖ్యాత నర్తకుడు కాళియ ఫణా(పడగ)లనే విశాల సద్మం- భవనంలో నిత్యమైన నైపుణ్యంతో నృత్యమాడాడు. అందెలు గజ్జెలు మ్రోయగ నందనందనుడు లీలా విలాస గతులతో లయబద్ధంగా కాళియ పడగలపై ఎడపెడ వడివడిగా చిందులు తొక్కాడు. ప్రళయంకరంగా ప్రచండ నృత్యకాండ సలిపి ‘తాండవ’ కృష్ణుడయ్యాడు! ‘దిక్పటధరుడు- దిగంబరుడు హరుడు నటరాజే, వటపత్రశాయి నగధరుడు పీతాంబరుడు నటవరుడు హరి’ అని ఇచ్చట ముచ్చటగా నిరూపించాడు కరివేలుపు కృష్ణుడు! ఇది గాంచి పరవశించి సురులు, మునులు తమ భార్యలతో కూడి విరుల వానలు కురిపించారు.
కాళియుడు ముఖాల నుంచి రక్తమాంసాలు వెళ్లగక్కాడు. అతని కళ్లనుంచి విషం పెల్లుబికింది. ప్రాణాలు గొంతు వరకు వెళ్లుకుని వచ్చాయి. శక్తి సన్నగిల్లి నీరసించి పోయాడు. తల ప్రాణం తోకకు రాగా విలవిలలాడి పోతూ కాళియుడు తనలో ఇలా తలపోశాడు… ‘ఆహా! ఇది కలా లేక కల్లా?’ నా విషమనే పావక (అగ్ని) జ్వాలలు సోకితే చాలు, నాక సదులు (దేవతలు) కూడా చావక మానరే! అయ్యో! ఇదేమి చోద్యం? ఈ బాలశౌరి నా శిరశ్శతకాన్ని (నూరు పడగలను) చితక తొక్కుతూ అతల కుతలం చేస్తున్నాడు. చూడగా ఇతడు సామాన్యుడుగా కానరావడం లేదు. సకల చరాచర ప్రాణి వర్గానికి ప్రభువైన ఆ పరమేశ్వరుడే! హరి సేవాప్రీతుడు- భక్తితో సేవిస్తే ప్రసన్నుడవుతాడు’ అని ప్రాణభీతితో అంతఃకరణంలో భరణ- న్యాసం (రక్షణ భారాన్ని ఆ భగవంతునికే వదలి) చేసి తక్షణం శరణాగతుడయ్యాడు.
శుకుడు- రాజా! కాళియుని భార్యలు- నాగకాంతలు దిక్కు తెలియక భ్రాంతికి లోనై తత్తరపడుతూ వచ్చి, శ్రాంతుడై- చితికిపోయి, చచ్చినట్లు పడి ఉన్న తమ భర్తను చూచి బిత్తరపోయి, మిక్కిలి నొచ్చుకొని, బావురుమని ఏడుస్తున్న వేవురు (పలువురు) బిడ్డలను ముందుపెట్టుకొని, కృష్ణ చందురునికి వందనాలు అర్పించి, అంజలిగావించి, కృద్ధుడై ఉన్న అనిరుద్ధ భగవానుడు తమ పతికి విధించిన శిక్షను- ‘అధోక్షజా! ఇది నీ కక్షపూరితం కాదు’ అని ఆమోదిస్తూ, శ్రద్ధా భక్తులతో తమ సౌభాగ్య సమృద్ధిని కాంక్షిస్తూ భక్తితో ఇలా జాలిగా నుతించారు… సుగుణనిధీ! క్రూరులను దండించడానికి అవనిపై అవతరించిన మహానుభావుడవు నీవు! క్రూరుడైన ఈ కాళియుని శిక్షించడం నీకు వీరత్వమే కాని క్రూరత్వం కాదు. అజాత శత్రువువైన నీకు దుష్ట శిక్షణం లోక రక్షణమే కదా!
క॥‘నిగ్రహమె మము విషాస్యుల
నుగ్రుల శిక్షించుటెల్ల? నూహింప మహా
నుగ్రహము గాక మా కీ
నిగ్రహము విషాస్యభావ నిర్గతి జేసెన్’…
‘స్వామీ! మేము గళం-కోరలలో ఘోరమైన గరళం (విషం) కలవారం. క్రూరమైన కోపం కల పాప (సర్ప)జాతి వారం. మావంటి వారిని శిక్షించడం మండనమే (అలంకారమే) కాని దండన అనిపించుకోదు. కారణం? దీనివలన విషం కలవారమని ఎగిరెగిరి పడే మా పొగరు, పగ శాశ్వతంగా ఇగిరిపోయాయి. ధర్మ విగ్రహా! ఈ నీ నిగ్రహం- శిక్ష, దండనం మా యెడల మహా అనుగ్రహమే!’
ఉ॥‘ఎట్టి తపంబు సేసెనొకొ? యెట్టి సుకర్మము లాచరించెనో?
యెట్టి నిజంబు పల్కెనొకొ? యీ ఫణి పూర్వ భవంబునందు ము
న్నెట్టి మహానుభావులకు నెన్నడు జేరువగాని నీవు నే
డిట్టి వినోద లీల దలకెక్కి నటించెదవీ ఫణీంద్రుపై’
‘పురుషోత్తమా! ఈ కాళియుడు పూర్వజన్మల్లో ఎటువంటి తపస్సులు చేశాడో? ఎలాంటి సత్కార్యాలు చేశాడో? ఎన్ని నిజాలు పలికాడో? ఎంతటి మహానుభావులకు కూడా ఏనాడూ దరిచేరని ఓ హరీ! నీవు ఈ భోగిరాజు పడగలపై వినోదంగా నాట్యం చేశావంటే అది ఎంతటి భాగ్యమో కదా!’
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006