Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల ఖాతాల్లోంచి లక్షలు కొట్టేస్తున్నారు. ఇక తాజాగా ఫేక్ పార్సిల్ స్కామ్లో 33 ఏండ్ల మహిళ ఏకంగా రూ. 7.9 కోట్లు నష్టపోయారు. కర్నాటకలోని ఉడుపికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నమ్రతను స్కామర్లు ఫెడ్ఎక్స్, ముంబై పోలీస్ అధికారులుగా నమ్మబలుకుతూ మోసగించారు.
జూన్ 22న నమ్రతకు ఫెడ్ఎక్స్ ఉద్యోగి అని చెబుతూ సంజయ్ కుమార్ అనే వ్యక్తి కాల్ చేశాడు. బాధితురాలి చిరునామాకు అనుమానాస్పద పార్సిల్ బుక్ చేశారని చెప్పాడు. ఈ పార్సిల్లో ఐదు ఇరాన్ పాస్పోర్ట్లు, డెబిట్ కార్డులు, 150 గ్రాముల మాదకద్రవ్యాలు ఉన్నాయని నమ్మబలికాడు.
ముంబై పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పాడు. ఆపై ముంబై పోలీస్ అధికారి అంటూ మరో వ్యక్తి ఆమెకు కాల్ చేశాడు. స్కైప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని స్కామర్లు ఆమెను కోరారు. ఆపై పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియ పేరుతో ఆమె నుంచి రూ. 7.9 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read More :
Mega DSC | మెగా డీఎస్సీ ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు