Fire Accident | రంగారెడ్డి : షాద్నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఎగిసిపడడంతో కార్మికులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేసింది. సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో ఫర్నస్ పేలడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు. అగ్నికీలల ధాటికి ఆరుగురు మృతి చెందగా, దాదాపు 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను పోలీసులు సమీప ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో చాలా మందికి తలకు, కాళ్లకు గాయాలయ్యాయి. బాధిత కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. అయితే మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మిగతా కార్మికులు డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
అగ్నిప్రమాదం (Fire Incident) లో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాద విషయం తెలియగానే ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు(Medical treatment ) అందించాలని సూచించారు. ప్రమాద స్థలంలో ఉన్న కలెక్టర్, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమలు, వైద్య బృందాలు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.