న్యూఢిల్లీ: బాహుబలి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli)కి అరుదైన గౌరవం దక్కింది. ఆయనతో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి, హిందీ నటి షబానా అజ్మీలకు.. ఆస్కార్ అవార్డులు అందజేసే అకాడమీలో సభ్యత్వ ఆహ్వానం అందింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా సుమారు 487 మంది కొత్త సభ్యులకు ఆహ్వానం పంపింది. ఆ జాబితాలో రాజమౌళి, షబానా అజ్మీ, రమా రాజమౌళి, రితేశ్ సిద్వానీ ఉన్నారు. కొత్తగా ఇన్విటేషన్ అందుకున్నవారిలో 71 మంది ఆస్కార్ నామినీలు ఉన్నారు. మరో 19 మంది ఆస్కార్ విజేతలు కూడా ఉన్నారు.
ఆస్కార్ అకాడమీ ఇన్విటేషన్ అందుకున్న సెలబ్రిటీల్లో సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్, ఫిల్మ్మేకర్ రిమా దాస్, నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కూడా ఉన్నారు. అహ్వానం అందిన ప్రతి ఒక్కరూ ఆ కమిటీలో చేరితే, అప్పుడు మొత్తం సభ్యత్వ సంఖ్య 10,910కి చేరుకుంటుంది. దీంట్లో సుమారు 9 వేల మంది ఆస్కార్ వేడుకల సమయంలో ఓటింగ్ వేసే అర్హత కలిగి ఉంటారు.
అకాడమీ ప్రెస్ రిలీజ్ ప్రకారం.. 2024 ఆహ్వాన జాబితాలో 44 శాతం మహిళలు, 41 శాతం ఎథ్నిక్ కమ్యూనిటీలు ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా కాకుండా 56 దేశాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. అకాడమీ సీఈవో బిల్ క్రామిర్, అధ్యక్షుడు జానెత్ యాంగ్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచదేశాలకు చెందిన ట్యాలెంట్ ఆర్టిస్టులు, ప్రొఫెషనల్స్ను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆహ్వానం అందిన వ్యక్తులు సభ్యత్వం కోసం ఏదో ఒక శాఖను ఎన్నుకోవాల్సి ఉంటుంది.