AMB Classic | సినిమాలు అనగానే ఆర్టీసీ క్రాస్ రోడ్డు గుర్తుకొస్తుంది. కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. అక్కడ వేల సంఖ్యలో జనాలు వాలిపోతుంటారు. ఎందుకంటే.. ఆ అడ్డాలో ఒకప్పుడు దాదాపు పదిహేనుకు పైగా థియేటర్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య కాస్త తగ్గింది. అయినప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు. తమ అభిమాన హీరోల సినిమాలు విడుదలైన రోజు.. పటాకులు, బ్యాండ్ మోతలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. అంతేకాదు.. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న థియేటర్లలో చాలా సినిమాలు వంద రోజులకు పైగా ఆడాయి. పలు సినిమాలు సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా నమోదు చేసుకున్నాయి. అంతటి ప్రత్యేకత ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మరో ప్రత్యేకత సంతరించుకోబోతోంది.
అదేంటంటే.. ప్రిన్స్ మహేశ్ బాబు ఏఎంబీ క్లాసిక్ను సినీ లవర్స్ ముందుకు తీసుకురాబోతున్నారట. అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సుదర్శన్ 70 ఎంఎం స్థానంలో ఏఎంబీ క్లాసిక్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 7 స్క్రీన్లతో మల్టీప్లెక్స్ను సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి ఏఎంబీ క్లాసిక్ అని నామకరణం చేస్తున్నట్లు కటౌట్లో రాసి ఉంది. ఏసియన్ గ్రూప్ భాగస్వామ్యంలో ఇది నడవనుంది. ఏఎంబీ సినిమాస్ మొదట 2018లో గచ్చిబౌలిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఇప్పటి వరకు సింగిల్ స్క్రీన్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఏఎంబీ క్లాసిక్ ఏడు స్క్రీన్లతో అందుబాటులోకి వస్తుండడంతో సినీ లవర్స్కు పండుగే. ప్రస్తుతం నారాయణగూడ, కాచిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో శాంతి, సప్తగిరి, సుదర్శన్ 35, సంధ్య 70, సంధ్య 35, దేవి 70, తారకరామ, శ్రీ మయూరి, వెంకటరమణ ఈ ప్రాంతంలో ఉన్నాయి.
ప్రస్తుతం ఏఎంబీ క్లాసిక్ నిర్మాణం రూపుదిద్దుకుంటున్న స్థానంలో ఉన్న సుదర్శన్ 70 ఎంఎంను 1970, ఆగస్టు 15న ప్రారంభించారు. నర్సింహులు అనే వ్యక్తి దీన్ని నడిపారు. అనేక సంవత్సరాల తర్వాత థియేటర్ను నడిపించలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక కష్టాలు వెంటాడటంతో ఆ థియేటర్ను 2010లో కూల్చేశారు.