నాగచైతన్యకు భయమెందుకు..? అయినా ఏ విషయంలో అయినా అంతగా భయపడుతున్నాడు అనుకుంటున్నారా..? నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు నాగచైతన్య నిజంగానే భయపడుతున్నాడు. ఒక విషయం మాత్రం ఆయనకు సరిగ్గా నిద్ర కూడా పట్టనివ్వడం లేదు. ఆ విషయం ఏంటో కాదు ‘లవ్ స్టోరీ’ సినిమా. అదేంటి శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా.. పైగా మంచి అంచనాలు ఉన్నాయి.. అన్నింటికంటే ముఖ్యంగా తన కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ చేస్తున్న సినిమా.. ఇంతకంటే ఏం కావాలి నాగచైతన్యకు..? ఇంకా ఈ సినిమా విషయంలో భయమెందుకు అనే అనుమానాలు రావచ్చు.
అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక్క విషయం మాత్రం చైతన్యను టెన్షన్ పెడుతుంది. ఆ టెన్షన్ పేరు సాయి పల్లవి. ఈమె సినిమాలో ఉంటే ఏ సినిమాకైనా టెన్షన్ తప్పదు. ఎందుకంటే ప్రేక్షకుల్లో అటెన్షన్ మొత్తం ఈ ముద్దుగుమ్మ పైకి వెళ్తుంది. అలా వెళ్లేలా చేస్తున్న సాయి పల్లవి. సన్నివేశం అయినా.. డాన్స్ అయినా.. పాటలైనా ఏదైనా కూడా ఒక్కసారి సాయి పల్లవి రంగంలోకి దిగితే పక్కన ఎవరున్నా కనిపించరు. అంతగా స్క్రీన్ తినేస్తుంది సాయి పల్లవి. అందుకే ఈమె నటించిన సినిమాల్లో కేవలం ఈమె మాత్రమే హైలెట్ అవుతుంది. ‘ఫిదా’ సినిమా అంత సంచలన విజయం సాధించింది అంటే దానికి కారణం కేవలం సాయిపల్లవి అంటారు అభిమానులు. అందులో వరుణ్ తేజ్ హీరో అయినా కూడా ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలా అయిపోయింది ‘ఫిదా’ పరిస్థితి. ఆ తర్వాత ‘కణం’ సినిమాలో నాగ శౌర్య నటించాడు. అది కూడా పూర్తిగా సాయిపల్లవి సినిమా అయిపోయింది.
ఇలా ఈమె ఏ హీరోతో నటించినా కూడా అతన్ని పూర్తిగా డామినేట్ చేస్తుంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా సాయిపల్లవి దెబ్బకు స్క్రీన్ పై కనిపించకుండా పోతారు. ఇప్పుడు చైతూకు కూడా ఇదే టెన్షన్. ‘లవ్ స్టోరీ’ సినిమాలో కూడా సాయి పల్లకి అత్యంత ప్రధానమైన పాత్ర ఇచ్చాడు శేఖర్ కమ్ముల. హీరో ఉన్నా కూడా అందరి చూపు సాయిపల్లవిపైనే ఉంది. అంతే కాదు సపరేట్ పాట కూడా పెట్టాడు. సారంగ దరియా అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూ ట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ అవుతుంది. ఏదైనా కూడా నాగచైతన్యను సాయి పల్లవి టెన్షన్ అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. ఏప్రిల్ 16న ఈ సినిమా విడుదల కానుంది.