Animal Movie | బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’ (Animal). గతేడాది డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఏం సందేశాలు ఇస్తున్నాయని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. ఇక దీనికి కౌంటర్గా ‘యానిమల్’ దర్శకుడు సందీప్ వంగా కూడా ఘాటుగా రిప్లయ్ ఇచ్చాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఈ యానిమల్ సినిమాపై వచ్చిన వివాదలపై తాజాగా స్పందించాడు నటుడు రణ్బీర్ కపూర్.
నేను మొదట ఈ కథ విన్నప్పుడు చాలా భయపడ్డాను. అయితే తాను గుడ్ బాయ్ అనే ఇమేజ్ నుంచి దూరంగా వెళ్లాలి అనుకున్నాను. ఈ క్రమంలోనే యానిమల్ చేశాను. ఈ సినిమా విడుదల అయ్యాక చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ చూసిన కొందరు బాగుందని అని చెప్పగా నా కుటుంబ సభ్యులు మరికొంతమంది ఇలాంటి సినిమా ఎలా చేశావని తిట్టారు. ప్రేక్షకుల కోసమే ఈ సినిమా చేసిన.. అది తప్పు దారిలో ప్రేక్షకుల దగ్గరికి వెళ్లింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయడం. ఇదోక స్త్రీ ద్వేషపూరిత చిత్రమని చెప్పడం మాకు నెగిటివ్ అయ్యింది. సందీప్ వంగా తీసిన కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి) కూడా ఇంతకుముందు ఇలాంటి వివాదాలనే ఎదుర్కోంది. అందుకే అవి పట్టించుకోలేదు. యానిమల్ సినిమా నచ్చని వారిలో ఇండస్ట్రీ వాళ్లు ఉన్నారు. వాళ్లకి ఒక్కటే చెప్పాను. క్షమించండి మరోసారి ఇలాంటి సినిమా చేయను అంటూ రణ్బీర్ కపూర్ వెల్లడించాడు.