ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్కల్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి ‘హరిహరవీరమల్లు’ కాగా, రెండోది ‘ఓజీ’, మూడోది ‘ఉస్తాద్ భగత్సింగ్’. ఈ మూడు సినిమాలు పూర్తి చేయాల్సి బాధ్యత ప్రస్తుతం పవన్పై ఉంది. జూలై నుంచి పవన్ షూటింగుల్లో పాల్గొంటారని ఫిల్మ్వర్గాల టాక్. ముఖ్యంగా క్రిష్ డైరెక్షన్లో మొదలైన ‘హరిహరవీరమల్లు’ సినిమా 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఆ మిగిలిన పార్ట్ని ఏ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తిచేయనున్నాడు. రెండు పార్ట్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని తొలి పార్ట్ని ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాదే విడుదల చేయాలనే గట్టి తలంపుతో ఉన్నారు నిర్మాత ఏ.ఎం.రత్నం. పవన్ షూటింగులు మొదలుపెడితే.. ముందు పూర్తి చేయాల్సిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా గురించి ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ ‘ ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతున్నది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయి.
ఇరాక్కి చెందిన ప్రముఖ కంపెనీతో మచిలీపట్నం ఓడరేవు సన్నివేశాలకు సీజీ వర్క్ చేయిస్తున్నాం. ఇందులో కుస్తీ పోటీల ఎపిసోడ్ ఉంది. దానికి సంబంధించిన సీజీవర్క్ బెంగళూర్లో జరుగుతున్నది. అలాగే.. చార్మినార్ ఎపిసోడ్ సీజీ వర్క్, పులితో పవన్కల్యాణ్ పోరాట సన్నివేశానికి సంబంధించిన సీజీ వర్క్ ఇవన్నీ జరుగుతున్నాయి’ అని తెలిపారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్కల్యాణ్ సినిమాలు చేస్తాడా? చేయడా? అనే ప్రశ్నలతో సతమతమవుతున్న అభిమానులకు ఏ.ఎం.రత్నం ఓ విధంగా శుభవార్తే చెప్పారు.