నక్కతోక తొక్కి టాలీవుడ్లోకి అడుగుపెట్టినట్టుంది పూణే భామ భాగ్యశ్రీబోర్సే. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా ఇంతవరకూ విడుదల కాలేదు. కానీ అవకాశాలు మాత్రం వరుస పెట్టాయి. దానికి కారణం కేవలం భాగ్యశ్రీ అందమే. లుక్ పరంగా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండటం కూడా ఓ కారణం కావొచ్చు. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల కాకుండానే మరో మూడు తెలుగు సినిమాలకు సంతకం చేసేసింది ఈ అందాలభామ. అందులో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఒకటి. ఈ సినిమా షూటింగ్లో కూడా ఇప్పటికే భాగ్యశ్రీ పాల్గొన్నట్టు తెలుస్తున్నది. ఇక రెండో సినిమా నానిది. ఆయన హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.
అందులో కూడా భాగ్యశ్రీబోర్సేనే కథానాయిక. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. అలాగే.. ‘లక్కీభాస్కర్’ తర్వాత దుల్కర్ సల్మాన్ మళ్లీ తెలుగులోనే ఓ సినిమా చేయనున్నారట. రవి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాలో కూడా భాగ్యశ్రీబోర్సేనే కథానాయికగా కన్ఫర్మ్ అయ్యిందట. ఈ సినిమా ప్రకటన త్వరలో రానుంది. ఈ అందాలభామ జోరు చూస్తుంటే, అనతికాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనిపించుకునేలా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.