‘తిరగబడరాసామీ’ చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు సినీరంగానికి పరిచయమవుతున్నది మాల్వి మల్హోత్రా. రాజ్తరుణ్ హీరోగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం మాల్వి మల్హోత్రా పాత్రికేయులతో మాట్లాడుతూ ‘మాది హిమాచల్ప్రదేశ్. థియేటర్ ఆర్ట్స్ చేసిన అనంతరం టీవీ ఇండస్ట్రీలోకి వెళ్లాను. ఆ తర్వాత హిందీ, తమిళ భాషల్లో ఒక్కో సినిమా చేశా’ అని చెప్పింది.
‘తిరగబడరాసామీ’ చిత్రంలో తాను బాలకృష్ణ అభిమాని పాత్రలో కనిపిస్తానని, తన క్యారెక్టర్ కారణంగానే కథ మలుపులు తీసుకుంటుందని, చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్తో సాగే చిత్రమిదని తెలిపిందీ భామ. ‘మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్లో తర్ఫీదునిచ్చే యువతిగా కనిపిస్తాను. తొలి సినిమాలోనే యాక్షన్ సీక్వెన్స్ చేయడం కొత్త అనుభూతినిచ్చింది. రాజ్తరుణ్తో పనిచేయడం హ్యాపీగా అనిపించింది’ అని చెప్పింది. తెలుగులో రాజమౌళి తన ఫేవరేట్ దర్శకుడని, ఆయన సినిమాల్లో నటించడం తన కల అని, ప్రస్తుతం తెలుగులో రెండు మూడు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని మాల్వి మల్హోత్రా పేర్కొంది.