నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ అమ్మడికి మహానటి చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో మహానటి సావిత్రి మాదిరిగానే నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాకి గాను కీర్తి నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్ గా చేస్తోంది.
‘కళావతి’గా ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కనిపించబోతుండగా ఇటీవల విడుదలైన సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోలందరి సరసన నటించే ఆఫర్స్ అందుకుంటున్న కీర్తి సురేష్ ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య ప్రొడక్షన్లో నటించే ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ‘తానా సెందా కొట్టం’ చిత్రంలో సూర్య సరసన నటించిన కీర్తి సురేశ్ ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో తెరకెక్కనున్న చిత్రంలో నటించనుందట.
జాతీయ అవార్డు గ్రహీత ఫేమస్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా ఇందులో కీర్తిసురేశ్ మరియు అథర్వా లు జోడీగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంపైన అప్పుడే భారీ అంచనాలు నెలకొని ఉండగా త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు. కాగా, కీర్తి క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు. తెలుగు,తమిళం,హిందీ భాషలలో వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది.
మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ‘మరక్కర్: అరేబియన్ సింహం’ చిత్రంలో ‘ఆర్చ’గా కనిపించనుంది కీర్తి. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తె’లోనూ కీర్తి హీరోయిన్గా నటిస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ హీరోగా నటిస్తున్న ‘సాని కాయిధమ్’లోనూ కీర్తి కీ రోల్ ప్లే చేస్తోంది. దీంతో పాటు ‘వాశి’ అనే మలయాళ సినిమాలోనూ కీర్తి నటిస్తోంది.