కిరీటాల్లేవ్.. ధనుర్బాణాలు అస్సల్లేవ్.. రథాల అలికిడి లేదు.. గుర్రాల సకిలింపులూ లేవు. అసుర రాజు ఆగ్నేయాస్త్రం సంధించడాలు కనిపించవు. దానికి విరుగుడుగా అవతారపురుషుడు వారుణాస్త్రం ఎక్కుపెట్టడం అస్సలు ఉండదు. అంతా మాయ! ఏదో మిథ్య!! సైన్స్ అండ్ ఫిక్షన్గా రూపాంతరం చెందిన ఫక్తు పౌరాణిక చిత్రం.. ఈ వారమే వెండితెరపై జైత్రయాత్ర చేయనుంది. అదే ‘కల్కి 2898 ఏడీ’! ద్వాపర యుగాంతం నుంచి కలియుగాంతం వరకు నడిచిన కథ! ఆరువేల సంవత్సరాల సుదీర్ఘ కాలయానాన్ని.. మూడు గంటల నిడివిలో నిక్షిప్తంచేసి.. సెల్యులాయిడ్ స్క్రీన్పై పెనుబాంబులా విసురుతున్నాడు దర్శకుడునాగ్ అశ్విన్. ఇంతకీ ఇది ఏ తరహా చిత్రం.. తెలుగు తెరపై కాంతులు విరజిమ్మిన పౌరాణిక చిత్రాల సరసన నిలవనుందా! హాలీవుడ్కు సవాలుగా నిలిచే సైన్స్ వండర్గా వెలిగిపోనుందా?
Kalki 2898 AD | తెలుగు ఇండస్ట్రీలోకి ఎస్వీయార్ వచ్చాడు.. హిరణ్యకశిపుడి పాత్ర రొమ్ము విరిచింది. ఎన్టీయార్ వచ్చాడు రాముడు, కృష్ణుడు పాత్రలు మురిసిపోయాయి, సుయోధనుడి పాత్ర మరింత విర్రవీగింది. అక్కినేనిని చూసి అర్జునుడి వేషం కొత్తరూపు సంతరించుకుంది. అభిమన్యుడి పాత్ర మరింత ముద్దుగా కనిపించింది. సీఎస్సార్ వాక్చాతుర్యానికి శకుని పాచికలు మరింత చక్కగా పారాయి. ఇలా చెబుతూ వెళ్తే.. తెలుగు సినిమాను పురాణ భరితం చేసిన దర్శక, నిర్మాతలు, నటీనటులు ఎందరెందరో! పౌరాణిక చిత్రాలు టాలీవుడ్ పేటెంట్ రైట్. తెలుగు వెండితెరపై తొట్టతొలుత ఆడిన చిత్రం పౌరాణికమే! ఆనాటి నుంచి రెండుమూడు దశాబ్దాలపాటు ఎన్నెన్నో పౌరాణిక చిత్రాలు వచ్చి బహుళ ప్రజాదరణ పొందాయి. రామాయణం, మహాభారతం, అష్టాదశ పురాణాలు, భాగవతం అన్నీ తెలుగు సినిమాలై ప్రేక్షకులకు పురాణ వైభవాన్ని కండ్లకుకట్టాయి. ‘బాలభారతం’, ‘శ్రీకృష్ణపాండవీయం’, ‘పాండవ వనవాసం’, ‘నర్తనశాల’, ‘దానవీరశూరకర్ణ’ ఈ ఐదు చిత్రాలు వరుసకట్టి చూస్తే అష్టాదశ పర్వాల భారతం బుర్రలో స్థిరంగా నిలిచిపోతుంది. ఇక రామాయణ కావ్యం ఆధారంగా పదుల సంఖ్యలో పౌరాణిక చిత్రాలు తెలుగు తెరను పునీతం చేశాయి.
హిరణ్యకశిపుడు, నరసింహస్వామి కథ ఎప్పుడో సత్యయుగం నాటి సంఘటన. మనకు పురాణగాథ. రామరావణుల యుద్ధం త్రేతాయుగం నాటి ముచ్చట. కృష్ణ లీలలు ద్వాపర యుగం సంబురం. ఇవన్నీ మనకు పురాణ వాఙ్మయం రూపంలో అందుబాటులో ఉండొచ్చు! కానీ, సినిమాలుగా ప్రదర్శితమయ్యాక.. పురాణేతిహాసాల్లో ఇంతుందా అనిపించింది. ఇంత పురాణం ఇప్పుడు చెప్పడం ఎందుకంటే.. కారణం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా వస్తుండటమే! పురాణాలకూ, ఆ సినిమా కథకూ ప్రత్యక్ష సంబంధం ఉందని ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడే తెలిసిపోయింది. టీజర్ వచ్చాక ఆ అభిప్రాయం మరింత బలపడింది. ట్రైలర్ చూశాక.. ఉన్న కాస్త అనుమానమూ పటాపంచలైంది.
నాగ్ అశ్విన్ అల్లుకున్న కథంతా పురాణోక్తమే! ద్వాపర యుగంలో కథ మొదలవుతుందనీ ఆయనే చెప్పాడు. కలియుగాంతం ఎలా ఉంటుందో చెబుతానంటున్నాడు. శ్రీమహావిష్ణువు దశావతారమైన ‘కల్కి’ కథానాయకుడు. సప్తచిరంజీవుల్లో ఒకడైన పురాణ పురుషుడు అశ్వత్థామ పాత్ర ఉండనే ఉంది. మోక్షనగరి కాశికాపురి కథా వేదికగా కనిపిస్తున్నది. యోగులు, దేవతలూ సంచరిస్తారని చెప్పే ‘శంబల’ నగరి ప్రస్తావనా ఉంది. మన్వంతరంలో మొదటిదైన సత్యయుగంలోనే హిరణ్యకశిపుడి లాంటి తపశ్శక్తి సంపన్నుడైన రాక్షసుడు ఉంటే… కలియుగాంతంలో తారసపడే రాక్షసుడు ఇంకెంత బలంగా ఉంటాడో ఊహించుకొని ప్రతినాయకుడు ‘కలి’ పాత్ర సృష్టించానని దర్శకుడే స్వయంగా ప్రకటించాడు. అంటే.. ఈ ‘కలి’ కూడా మాంచి ఆకలి మీదున్న పురాణ పాత్రేనని అర్థం చేసుకోకుండా ఎలా ఉండగలం?
టేకింగ్లో తేడా ఉండొచ్చు. వేషభాషల్లో ఆధునికత కనిపించొచ్చు. నాటి మేటి పౌరాణిక చిత్రాల మాదిరి సంస్కృత సమాస భూయిష్టమైన భారీ డైలాగులు ఉండకపోవచ్చు.పోరాటాల్లో పద్మవ్యూహాలు లేకపోవచ్చు.అస్త్రశస్ర్తాలు రూపు మారి ఉండొచ్చు. ఈ చిత్ర కథానాయకుడు ప్రభాస్ వేసుకున్న రోబోటిక్ సూట్.. ద్వాపరంలో కర్ణుడి సహజ కవచాన్ని గుర్తు చేస్తున్నది. పోరాట సన్నివేశాల్లో పేలుతున్న అస్ర్తాలు.. ‘మాయాబజార్’లో హిడింబి ఆవాసానికి వస్తున్న అభిమన్యుడిపై ఘటోత్కచుడు సంధించిన శస్ర్తాలను మరిపిస్తున్నాయి.
నిత్యనైమిత్తిక కర్మల్లో చెబుతున్న సంకల్పం ఆధారంగా.. ఇప్పటికింకా మనం కలియుగం ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఇప్పుడే ఏఐ టెక్నాలజీ ఇంతగా తిమ్మినిబమ్మి చేస్తుంటే.. చతుర్థ పాదంలో సాంకేతికత మరెంత విశృంఖల మాయ చేస్తుందో మామూలు మస్తిష్కంతో అంచనా వేయలేం. మన పురాణాల్లో వాటికీ లెక్కుంది. కలియుగాంతానికి మానవ జీవన ప్రమాణాలు ఎలా దిగజారుతాయో, ఆయుర్దాయం ఎంతగా పతనమవుతుందో, జలవనరులు ఎలా అధఃపాతాళానికి పడిపోతాయో రుషులు దర్శించి వివరించారు. ఆ సంగతులన్నీ పరిశీలించి, పరిశోధనలు చేసి, పరితపించి కథగా రాసుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఐదేండ్ల తపస్సు చేస్తే ఈ కథకు ఓ రూపం వచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఆరువేల ఏండ్ల చరిత్ర చెప్పాలంటే ఐదేండ్లు ఖర్చు చేయాల్సిందే కదా!
‘కల్కి..’ హాలీవుడ్ రేంజ్ను మించేలా చిత్రాన్ని నిర్మించినట్టు తెలుస్తూనే ఉంది. ఇన్ని కారణాలు ఏకరువు పెట్టినా.. ఇది పౌరాణికం అంటే డిజిటల్ లోకంలో విహరిస్తున్న ప్రేక్షకులు ఒప్పుకోకపోవచ్చు. కానీ, ఈ కలియుగం అంతం కావడంతో ఓ మహాయుగం పూర్తవుతుంది. మళ్లీ సత్యయుగం మొదలవుతుంది. మహాప్రళయ సమయంలో విష్ణుమూర్తి.. వేదాలను కాపాడి వైవస్వత మనువుకు ఇచ్చి పదిలమని చెప్పాడు. అలా అందిన వేదాలు సత్య, త్రేత, ద్వాపర యుగాలను దాటి.. కలియుగానికీ అందాయి. ఇప్పుడు అంతా క్లౌడ్ హవా. డిజిటల్ రూపంలో క్లౌడ్లోకి వెళ్లిపోయే ‘కల్కి 2898 ఏడీ’ కలియుగాంతం తర్వాత వచ్చే సత్యయుగం ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. అప్పటి జనాలు ఈ చిత్రాన్ని చూసి ‘పౌరాణిక చిత్రం’గా గుర్తించకుండా ఉండలేరు!
…? రామకీర్తన