Rimi Sen | సినీ ఇండస్ట్రీలో హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవడం కష్టం. వచ్చిన పేరును నిలబెట్టుకోవడం మరింత కష్టం. బాలీవుడ్తోపాటు టాలీవుడ్లోనూ సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భామ రిమీ సేన్. ‘ధూమ్’ సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన నటించి హిట్ కొట్టిన ఈ భామ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘అందరివాడు’లోనూ మెరిసింది.
2003లో ‘హంగామా’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రిమీ సేన్ గరం మసాలా, ఫిర్ హేరా ఫేరీ, గోల్మాల్, బాగ్బాన్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే, ప్రాధాన్యం లేని పాత్రలు రావడం వల్లే అప్పట్లో కొన్ని సినిమాలు చేయలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రిమీ. ‘కొన్ని కథల్లో నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. హంగామా, జానీ గద్దర్ లాంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేశా.
ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తే బాగుంటుందని కోరుకున్నా. కానీ వర్కవుట్ కాలేదు. అందుకే నా కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేద’ని రిమీ వ్యాఖ్యానించింది. ‘ఈ ఇండస్ట్రీలో టాలెంట్కు అంతగా ప్రాధాన్యం లేదు. ముందుగా వ్యక్తులను ఎలా మేనేజ్ చేయాలో తెలియాలి. లేకపోతే ఏ పనీ జరగదు. చాన్సులు అడుక్కోవడం, పీఆర్ చేయడం నాకు రాదు. స్నేహితులే నన్ను మోసం చేశారు’ అని వాపోయింది రిమీ సేన్.