అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు, అతని స్నేహితురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన మీడియా సమావేశాల్లో దర్శన్, పవిత్రగౌడను దంపతులని పేర్కొనడం పట్ల దర్శన్ సతీమణి విజయలక్ష్మి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దర్శన్కు చట్టబద్దమైన జీవిత భాగస్వామిని తానేనని, పోలీసు రికార్డుల్లో దర్శన్ భార్యగా పవిత్ర గౌడ పేరును పదేపదే పేర్కొనడం సమంజసం కాదని విజయలక్ష్మి బెంగళూరు పోలీస్ కమీషనర్ బి.దయానందకు ఓ లేఖ రాశారు. ‘ఇటీవల మీడియా సమావేశాల్లో పోలీసులతో పాటు కర్ణాటక హోంమంత్రి కూడా దర్శన్ భార్య పవిత్రగౌడ అని చెబుతున్నారు. నా భర్తకు ఆమె కేవలం స్నేహితురాలు మాత్రమే.
ఇకముందు ఆమె పేరును దర్శన్ సతీమణిగా చెప్పొద్దు. అలా చేస్తే భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి న్యాయపరమైన సమస్యలొస్తాయి. పవిత్రగౌడకు సంజయ్సింగ్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. కాబట్టి పోలీసు రికార్డుల్లో వాస్తవాలను రాయండి’ అంటూ విజయలక్ష్మి తన లేఖలో పేర్కొంది. కన్నడ ఇండస్ట్రీలో అగ్ర నటుల్లో ఒకరైన దర్శన్ కొంతకాలంగా నటి పవిత్రగౌడతో సహజీవనం చేస్తున్నారు. దీనివల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని బాధపడిన అభిమాని రేణుకా స్వామి..పవిత్రగౌడను హెచ్చరిస్తూ అసభ్య సందేశాలు పంపించాడని పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. ఈ విషయంలో కోపోద్రిక్తుడైన దర్శన్ తన అనుచరులతో కలిసి రేణుకాస్వామిని అంతమొందించారని పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ జరిగింది.