కష్టం వచ్చినప్పుడు తలుచుకోమ్మా.. నీకోసం ఎక్కడున్నా తిరిగొస్తాను.. అంటూ పాపకు అఖండ రుద్రసికిందర్ అఘోరా మాటివ్వడంతో ‘అఖండ’ సినిమా ముగిసింది. విజయాన్ని ముందే ఊహించి, సీక్వెల్కు తగ్గట్టుగా ముగింపు ఇచ్చాడు దర్శకుడు బోయపాటి శ్రీను. అప్పట్నుంచి ‘అఖండ’ పునరాగమనం కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఎదురుచూపులు ఫలించే ఘడియలు ఆసన్నమవుతున్నాయి.
అఖండ రుద్రసికిందర్ అఘోరాగా మళ్లీ బాలకృష్ణ మారబోతున్నారు. ఈ దఫా మరింత శక్తిమంతంగా, భారతీయ దేవాలయాలు, సనాతనధర్మం గొప్పతనం ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ‘అఖండ-2’ స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు దర్శకుడు బోయపాటి. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావచ్చింది. ఆగస్ట్ నెల తర్వాత ‘అఖండ 2’ షూటింగ్ ప్రారంభమవుతుందని ఇన్సైడ్ టాక్. ప్రగ్యా జైస్వాల్ మరోసారి ఇందులో కథానాయికగా కనిపించనుంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.