అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ నెలకొల్పిన వైజయంతీ మూవీస్ ఈ ఏడాదితో యాభై వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణంలో ఎన్నో కమర్షియల్ బ్లాక్బస్టర్స్ను అందించింది. వైజయంతీ మూవీస్ గోల్డెన్జూబ్లీ ఇయర్లోకి అడుగుపెట్టిన తరుణంలో ‘కల్కి 2898’ రూపంలో అపూర్వ విజయాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టిస్తున్నది. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి వసూళ్లతో దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో నిర్మాత సి.అశ్వనీదత్ పంచుకున్న విశేషాలు..
Aswini Dutt | మా చిత్రానికి తెలుగు రాష్ర్టాలతోపాటు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తున్నది. విదేశాల నుంచి కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మేము ఊహించినట్లుగానే సినిమా అఖండ విజయాన్ని సాధిస్తున్నది. ఈ సందర్భంగా ‘కల్కి 2898’ చిత్రం ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న దర్శకుడు నాగ్అశ్విన్ క్రియేటివ్ విజన్కు హ్యాట్సాఫ్ చెబుతున్నా. మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తొలి రెండు రోజుల్లో 298కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఆనందంగా ఉంది.
కోరినవన్నీ సమకూర్చాను
దర్శకుడిగా నాగ్అశ్విన్ ఎంతటి ప్రతిభావంతుడో నాకు తెలుసు. ‘మహానటి’ తర్వాత ఎలాంటి భారీ ప్రాజెక్ట్నైనా తెరకెక్కించగలడనే నమ్మకం ఏర్పడింది. అతను ఏ కథ చెప్పినా నో చెప్పకుండా ముందుకువెళ్లమని మా అమ్మాయిలకు చెప్పాను. నేను ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏళ్లయింది. నిర్మాతగా నా తొలి చిత్రం ‘ఎదురులేని మనిషి’ నుంచి ‘కల్కి’ వరకు దర్శకుడు చెప్పింది వినడం, తనకు కావాల్సింది సమకూర్చడం తప్ప డిస్కషన్స్ చేయను. ‘కల్కి’ విషయంలోనూ నాగ్అశ్విన్ కోరినవన్నీ సమకూర్చాను.
విజయంపై కాన్ఫిడెంట్గా ఉన్నాం
ఈ సినిమా విషయంలో మొదటినుంచీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. తొలుత మిడ్సమ్మర్లో విడుదల చేస్తే బాగుంటుందని అనుకున్నాం. తర్వాత జూన్ 27 కరెక్ట్ అనిపించింది. నాగ్, స్వప్న, ప్రియాంక ఫస్ట్ కాపీ చూశారు. విజయంపై ఎలాంటి సందేహం లేదన్నారు. నాగ్ అశ్విన్ ఈ కాన్సెప్ట్ గురించి చెప్పిన రోజు ఓ కొత్త ప్రపంచంలో విహరించబోతున్నామనే అనుభూతి కలిగింది. ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించి తనదైన సృజనాత్మకతతో స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. ఈ సినిమా మొదలుపెట్టే ముందు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో మాట్లాడాం. కథ విషయంలో ఆయన మంచి సలహాలు ఇచ్చారు. అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి.
600 కోట్లు ఖర్చు పెట్టాం
సినిమా నిర్మాణ సమయంలో రికార్డ్సు గురించి ఆలోచించలేదు. ఓ అత్యద్భుతమైన చిత్రాన్ని అందించాలనే తపనతో టీమ్ అందరమూ కష్టపడ్డాం. ప్రభాస్, అమితాబ్బచ్చన్, కమల్హాసన్, నాగ్ అశ్విన్ వెండితెరపై ఓ వండర్ క్రియేట్ చేశారు. వారి ప్రోత్సాహంతోనే సినిమాకు 600కోట్లు ఖర్చు పెట్టే ధైర్యం వచ్చింది. ప్రభాస్ అందించిన కో ఆపరేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నిజంగా డార్లింగే. ముంబయిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో అమితాబ్ గారు నాకు పాదాభివందనం చేసినప్పుడు నా తలకాయ కొట్టేసినంత పనైంది (నవ్వుతూ). మేము కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. అయితే ఆ రోజు స్టేజీ మీద ఆయన అలా చేయడం అస్సలు ఊహించలేదు. అమితాబ్ గారు లెజెండ్. ఆయనకు హ్యాట్సాఫ్.
తండ్రిగా గర్వపడుతున్నా
ఈ సినిమా సెకండ్పార్ట్కు సంబంధించిన షూటింగ్ కొంతమేర పూర్తయింది. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తి చేయడానికి ఏడాదికిపైగా పట్టొచ్చు. రెండో భాగం రిలీజ్ డేట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది ఇదే సమయానికి రావొచ్చు. మా అమ్మాయిలు ప్రపంచస్థాయి సినిమా తీసినందుకు తండ్రిగా గర్వపడుతున్నా. మా సంస్థను వారు గొప్ప శిఖరాలకు తీసుకెళ్తున్నారు. ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రస్తుతం రెండు సినిమాలు మాత్రమే తీసుకురావాలని అనుకున్నాం. తర్వాత స్క్రిప్ట్ను బట్టి మిగతా భాగాల గురించి ఆలోచిస్తాం. వైజయంతీ మూవీస్ బ్యానర్ కింద త్వరలో శ్రీకాంత్ తనయుడు రోషన్తో ‘ఛాంపియన్’ సినిమా చేయబోతున్నాం. అలాగే దుల్కర్ సల్మాన్తో ఓ సినిమా చేస్తున్నాం.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
నిర్మాతగా యాభై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా వైజయంతీ మూవీస్ సంస్థలో మొదటి చిత్రం ‘ఎదురులేని మనిషి’ నుంచి ‘కల్కి’ వరకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నా. నా విజయాల్లో వారందరికీ భాగస్వామ్యం ఉంది. మున్ముందు కూడా అందరూ గర్వించే చిత్రాలతో ప్రేక్షకులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.
ఈ కథ అనుకున్నప్పుడే రెండో భాగం కూడా తీయాలనే ఆలోచన వచ్చింది. కమల్హాసన్గారు ఈ ప్రాజెక్ట్లోకి ఎంటరైన తర్వాత సెకండ్ పార్ట్ పక్కాగా తీయాలని డిసైడయ్యాం. ప్రతినాయకుడు సుప్రీం యాస్కిన్ పాత్ర కోసం తొలుత కమల్హాసన్ను అనుకోలేదు. అర్జునుడిగా విజయ్దేవరకొండ సహా మిగతా ఆర్టిస్టులందరినీ మొదటినుంచే అనుకున్నాం.
…? సినిమా డెస్క్