Actor Darshan | రేణుకా స్వామి హత్య కేసులో నిందితులైన కన్నడ హీరో దర్శన్ తూగుదీప, పవిత్ర గౌడతోపాటు పలువురు నిందితులకు బెంగళూరు కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. దర్శన్, పవ్రిత గౌడతో పాటు మొత్తం 17 మంది నిందితుల కస్టడీ నేటితో ముగియగా.. వారిని తమకూరు జైళ్ల నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ మేరకు న్యాయమూర్తి కస్టడీని ఈ నెల 18 వరకు పొడిగించారు. రేణుకాస్వామి (33) అనే అభిమాని పవిత్రగౌడకు అసభ్యమైన సందేశాలు పంపాడని.. దాంతో కోపోద్రిక్తుడైన దర్శన్ తన అభిమాని హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
రేణుకా స్వామి మృతదేహం జూన్ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్మెంట్ పక్కనే ఉన్న ఉన్న మురుగు కాలువ వద్ద లభ్యమైన విషయం తెలిసిందే. చిత్రదుర్గలోని దర్శన్ అభిమాన సంఘంలో ఒకడైన నిందితుడు రాఘవేంద్ర.. రేణుకస్వామిని దర్శన్ కలవాలంటున్నాడని చెప్పి ఆర్ఆర్నగర్లోని షెడ్డుకు రేణుకాస్వామిని తీసుకెళ్లాడు. అక్కడ చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి షాక్, తీవ్ర గాయాల కారణంగా రక్తస్రావం జరిగి మృతి చెందాడు. రేణుకాస్వామి హత్యకు పవిత్ర గౌడ ప్రధాన కారణమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమెనే దర్శన్తో పాటు ఇతర నిందితులను ప్రేరేపించి హత్య చేయించినట్లు పేర్కొన్నారు. హత్య కేసులో పవిత్ర గౌడ ఏ1 కాగా.. దర్శన్ ఏ2గా ఉన్నాడు.