Madhuri Dixit | ఓ కంపెనీకి చెందిన ప్రచార ఒప్పందం విషయంలో బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త రెహన్ సిద్ధిఖీ ఆగస్ట్ నెలలో తన కంపెనీల ప్రమోషన్ కోసం టెక్సాస్లో భారీ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. ఈ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవరిస్తున్న మాధురి దీక్షిత్ టెక్సాస్ ఈవెంట్కు హాజరుకానుందని తెలిసింది. అయితే రెహన్ సిద్ధిఖీకి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయన్న కారణంతో భారత ప్రభుత్వం ఆయన నిర్వహించే సంస్థలను బ్లాక్లిస్ట్లో పెట్టింది.
ఈ నేపథ్యంలో మాధురిదీక్షిత్పై సోషల్మీడియా వేదికగా తీవ్ర విమర్శలొస్తున్నాయి. టెక్సాస్ ఈవెంట్కు సంబంధించిన ఓ పోస్టర్ను పొలిటికల్ కాలమిస్ట్ సునందా వశిష్ట్ తన సోషల్మీడియా ద్వారా పంచుకుంది. అందులో రెహన్ సిద్ధికీ, మాధురిదీక్షిత్ ఫొటోలున్నాయి.
షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది. రెహన్ సిద్ధిఖీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోకుండా మాధురిదీక్షిత్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నదని, తక్షణమే ఆమె టెక్సాస్ ఈవెంట్ను నుంచి తప్పుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం గురించి మాధురిదీక్షిత్ ఇంకా స్పందించాల్సి ఉంది.