“పిల్లాడు ఆడుకొనే ఆటబొమ్మ నుంచి కంప్యూటర్లో వాడే చిప్ వరకూ అన్నీ వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. అందుకే, దేశంలోని ప్రతీ గల్లీలో చైనా బజార్ కనిపిస్తుంది. అలా ‘మేకిన్ ఇండియా’ను ‘జోకిన్ ఇండియా’గా మార్చేసిన కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఇప్పుడు డ్రాగన్ కరెన్సీకి యూనివర్సల్ హోదా కట్టబెట్టడంలో కీలకంగా మారింది. అంతర్జాతీయ వార్తాసంస్థలు ‘రాయిటర్స్’, ‘బ్లూమ్బర్గ్’ తాజా పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది”
-స్పెషల్ టాస్క్ బ్యూరో
PM Modi | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రధాన మారకంగా తమ కరెన్సీ ఉండాలని ఏ దేశమైనా ఆశపడుతుంటాయి. ప్రస్తుతం యూనివర్సల్ కరెన్సీగా ఉన్న డాలర్ స్థానాన్ని ఆక్రమించాలని పౌండ్ స్టెర్లింగ్ (బ్రిటన్ కరెన్సీ), యూరో (యూరోపియన్ యూనియన్ కరెన్సీ, కువైట్ దినార్ (కువైట్ కరెన్సీ) ఎప్పటినుంచో తహతహలాడుతున్నాయి. అయితే, ఆ సోయి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్కు లేకుండా పోయింది. అందుకే, చమురు దిగుమతులకు సంబంధించి రష్యాకు చేయాల్సిన చెల్లింపులను రూపాయల్లో లేక రష్యా కరెన్సీ రూబెల్లో కాకుండా ఎప్పుడూ కయ్యాలకు కాలుదువ్వే చైనా కరెన్సీ ‘యువాన్’లో చెల్లింపులు జరుపుతున్నది. ఈ మేరకు అంతర్జాతీయ వార్తాసంస్థలు ‘రాయిటర్స్’, ‘బ్లూమ్బర్గ్’ తాజా పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది.
లావాదేవీల్లో కొత్తగా మార్పు
ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో అమెరికా, ఐరోపా దేశాలు పలు ఆంక్షలు పెట్టాయి. రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న చమురును ఆ దేశం నుంచి ఎవరూ దిగుమతి చేసుకోవద్దంటూ నిషేధం విధించాయి. అమెరికన్ డాలర్ను కూడా మారకంగా వినియోగించవద్దంటూ హెచ్చరించాయి. అయితే, దౌత్య సంబంధాల పేరిట రష్యా చమురును చౌకగా దిగుమతి చేసుకొంటున్న భారత్కు చెందిన పలు ప్రభుత్వ, ప్రైవేట్ చమురు రిఫైనరీలు తొలుత రూపాయల్లోనే ఈ చెల్లింపులు చేశాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ లావాదేవీలు చైనాకు చెందిన యువాన్ కరెన్సీలో జరుగుతున్నట్టు ‘రాయిటర్స్’, ‘బ్లూమ్బర్గ్’ తెలిపాయి. ఈ మేరకు సదరువర్గాలు వెల్లడించినట్టు పేర్కొన్నాయి. ప్రభుత్వరంగానికి చెందిన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్తో పాటు ప్రైవేటుకు చెందిన రెండు రిఫైనరీలు యువాన్ కరెన్సీతో చెల్లింపులు చేస్తున్నట్టు వివరించాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత జవాన్ల మరణానికి కారణమైన చైనాకు చెందిన కరెన్సీతో భారత్ చెల్లింపులు చేయడమేంటని పలువురు మండిపడుతున్నారు. భారత్ ఇలాంటి చర్యలకు సిద్ధపడితే, అంతర్జాతీయంగా చైనా కరెన్సీ మరింతగా బలపడే ప్రమాదమున్నదని వాదనలు వినిపిస్తున్నాయి.
సామాన్యుడికి అన్యాయం చేస్తూ..
పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురును ఎవరూ కొనుగోలు చేయట్లేదు. ఇదే అదునుగా భారత్ గత ఏడాదిన్నర కాలంగా తక్కువ ధరకే ఆ ముడి చమురును పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్నది. గత జూన్లో భారత్ దిగుమతి చేసుకొన్న మొత్తం ముడి చమురులో 42 శాతం వాటా రష్యా నుంచే వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే, పెద్దయెత్తున ముడి చమురును అత్యంత చౌకగా కేంద్రం దిగుమతి చేసుకొంటున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. రష్యా నుంచి చేకూరిన చమురు ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం తమ కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టడమే దీనికి కారణంగా తెలుస్తున్నది.