IT | న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. 2024-25 అసెస్మెంట్ ఏడాదికిగాను 7.28 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తాజాగా వెల్లడించింది. 2023-24 ఏడాది దాఖలు చేసిన 6.77 కోట్ల కంటే వీరి సంఖ్య 7.5 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నుల గడువు జూలై 31 చివరి రోజు 70 లక్షల మంది దాఖలు చేసినట్లు తెలిపింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసిన 7.28 కోట్ల మందిలో నూతన పన్ను విధానాన్ని ఎంచుకున్నవారు 5.27 కోట్ల మంది కాగా, పాత పన్నుల విధానాన్ని కొనసాగించిన వారు 2.01 కోట్ల మంది. పన్ను చెల్లింపుదారుల ప్రాధాన్యతలు అంతకంతకు పెరుగుతున్నాయి.
ఈసారి దాఖలు చేసిన వారిలో 72 శాతం మంది ఈ పన్ను విధానాన్ని ఎంచుకోగా, 28 శాతం మంది పాత పన్నుల విధానంలోనే దాఖలు చేశారు. అలాగే కొత్తగా దాఖలు చేసిన వారు 58.57 లక్షల మంది ఉన్నట్లు పేర్కొంది. దాఖలు చేసిన వారిలో ఐటీఆర్-1 కింద 45.77 శాతం(3.34 కోట్లు), ఐటీఆర్-2 కింద 14.93 శాతం(1.09 కోట్లు), ఐటీఆర్-3 కింద 12.5 శాతం(91.10 లక్షలు), ఐటీఆర్-4 కింద 25.77 శాతం(1.88 కోట్లు), ఐటీఆర్-5 నుంచి ఐటీఆర్-7 కింద 1.03 శాతం(7.48లక్షలు) కేటగిరిల కింద దాఖలు చేశారు. వీరిలో 43.82 శాతం మంది ఆన్లైన్లో ఐటీఆర్ దాఖలు చేయగా, మిగతావారు ఆఫ్లైన్లో నమోదు చేసుకున్నారు.
పన్ను చెల్లింపుదారులు పెరిగినట్లే పన్ను ఎగవేతదారులు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతున్నారు. గడిచిన పదేండ్లకాలంలో పన్ను ఎగవేతదారులు వెయ్యి రెట్లు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.9.08 లక్షల కోట్ల పన్ను చెల్లింపులకు సంబంధించి నోటీసులు జారీ అయ్యాయి. 2013014 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.80 వేల కోట్లుగా ఉన్నది.