Stock market : భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీ లాభాల్లో ముగిసింది. వరుసగా ఏడు రోజులుగా కొనసాగిన నష్టాలకు ఈ రోజు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 628 పాయింట్లు లాభపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 153 పాయింట్లు లాభపడింది. ఐటీ, ఫైనాన్సియల్ స్టాక్స్ భారీ లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ ఉదయం 77,468.45 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే సాగింది. గరిష్టంగా 77,611.11 పాయింట్లను తాకింది. చివరకు 628.04 పాయింట్లు (0.82%) లాభంతో 77,537.72 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 153.55 పాయింట్ల (0.64%) లాభంతో 24,231.85 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 షేర్ ఇండెక్స్లో ఐటీసీ, కోటక్ బ్యాంక్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభపడ్డాయి. వీటిలో ఎటర్నల్ 2 శాతం పైగా లాభపడింది. మరోవైపు టైటాన్, ఇండిగో, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్రాడర్ మార్కెట్లలో నిఫ్టీ స్మాల్క్యాప్ 100 షేర్లు 0.68 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్ షేర్లు 2.13 శాతం లాభపడగా, నిఫ్టీ కెమికల్స్ మ ఆత్రం 0.50 శాతం నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 93.94 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,490.60 వద్ద ట్రేడవుతోంది. రూపాయితో డాలర్ మారకం విలువ 95.71గా ఉంది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి అత్యధికంగా 5.74 శాతం లాభపడింది. జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ కూడా లాభాల్లోనే కొనసాగుతున్నాయి.