Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతున్నది. వరుస నాలుగు సెషన్లలో లాభాల్లో కొనసాగాయి. ఈ క్రమంలో మార్కెట్లు గురువారం కొత్త శిఖరాలను తాకాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్ ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైంది. 78,758.67 పాయింట్ల వద్ద లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభం కాగా.. కొద్దిసేపటికి సెన్సెక్స్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ తర్వాత పుంజుకొని సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. తొలిసారిగా సెన్సెక్స్ 79వేల మార్క్ను తాకింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 78,467.34 పాయింట్ల కనిష్ఠానికి చేరుకోగా.. కోలుకొని 79,396.03 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 568.93 పాయింట్ల లాభంతో 79,243.18 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం మొదటిసారిగా 24వేల పాయింట్ల మార్క్ను దాటడంతో పాటు ఎగువన ముగిసింది. నిఫ్టీ 175.70 పాయింట్ల లాభంతో 24,044.50 వద్ద ముగిసింది. అయితే, బ్లూ చిప్ స్టాక్స్లో వచ్చిన ర్యాలీతో సూచీలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. రిలయన్స్, ఐటీ షేర్లు బలపడడం మార్కెట్కు కలిసి వచ్చింది. మార్కెట్లో దాదాపు 1,128 షేర్లు పురోగమించగా.. 2,240 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎల్టీఐఎండ్ట్రీ, విప్రో, ఎన్టీపీసీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్ నష్టపోయాయి. సెక్టార్లలో ఐటీ, పవర్ సూచీలు ఒక్కొక్కటి 1.7 శాతం పెరిగాయి. పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఒక శాతం పడిపోయింది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగియగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం తగ్గింది.