Singareni హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): సింగరేణి ఇతర విభాగాల్లో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థ.. తాజాగా రాజస్థాన్లో మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్దమవుతున్నది. ఇందుకు సంబంధించి కంపెనీ సీఎండీ బలరాం.. గురువారం ఆ రాష్ట్ర రాజధాని జైపూర్లో విద్యుత్ విభాగ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని వారు భరోసా ఇచ్చారు. అనంతరం రాజస్థాన్ జెన్కో సీఎండీ దేవేంద్ర శ్రింగిని, రాజస్థాన్ రెన్యువబుల్ ఎనర్జీ కార్పొరేషన్ ఎండీ నథ్మల్ డైడెల్ను, రాజస్థాన్ డిసమ్స్ చైర్మన్ భానుప్రకాశ్తో ప్రత్యేకంగా ఆయన భేటీ అయ్యారు.
ప్లాంట్ ఏర్పాటు, పూర్తయిన తర్వాత విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి తదితర అంశాలపై వీరు ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే 235 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని బలరాం ఈ సందర్భంగా చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న యోచనతో ఉన్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్తు ఉన్నతాధికారులను కలిసి ఆ రాష్ట్రంలోని సోలార్ పారులో మెగా ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలపై చర్చించినట్టు వివరించారు.