Stock Market | ముంబై, ఆగస్టు 2: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. శుక్రవారం మదుపరులు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేశారు. దీంతో మెటల్, ఆటో, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు బలహీనంగా నమోదు కావడం అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు రుచించలేదు. ఈ ప్రభావం భారతీయ మార్కెట్లపైనా పడింది. ఆల్టైమ్ హైల్లో సూచీలు ఉండటంతోనూ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు వెళ్లాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే భారీ నష్టాలు వాటిల్లాయి. ఫలితంగా 5 రోజుల లాభాలకు తెరపడినైట్టెంది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 885.60 పాయింట్లు లేదా 1.08 శాతం క్షీణించి 80,981.95 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 998.64 పాయింట్లు పడిపోవడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 293.20 పాయింట్లు లేదా 1.17 శాతం పతనమై 24,717.70 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలోనైతే గరిష్ఠంగా 324.05 పాయింట్లు నష్టపోయింది.
రియల్టీ షేర్లు అత్యధికంగా 3.56 శాతం నష్టపోయాయి. మెటల్ 3 శాతం, ఆటో 2.97 శాతం, ఐటీ 2.05 శాతం, కమోడిటీస్ 1.83 శాతం, టెక్నాలజీ 1.79 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.70 శాతం చొప్పున క్షీణించాయి. ఇక మారుతీ సుజుకీ, టాటా మోటర్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ షేర్లు మదుపరులను ఆకట్టుకోలేక నష్టాలను మూటగట్టుకున్నాయి.
జూలైలో పడిపోయిన వాహన విక్రయాలతో ఆటో కంపెనీల షేర్లు, ఇన్ఫోసిస్కు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నోటీసుల కలకలంతో ఐటీ సంస్థల షేర్లు సెల్లింగ్ ప్రెషర్ను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో బీఎస్ఈ స్మాల్క్యాప్ 0.58 శాతం, మిడ్క్యాప్ 1.19 శాతం చొప్పున పడిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులను పరిశీలిస్తే.. ప్రధాన ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఐరోపాలోని కీలక దేశాల స్టాక్ మార్కెట్ల పరిస్థితీ ఇలాగే ఉన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నలా భావించే అమెరికాలో మరోమారు ఆర్థిక మాంద్యం ఛాయలు అలుముకుంటున్నాయా? అన్న అంచనాల నడుమ మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు.
ఈ పరిణామం భారత్సహా అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లను కుదిపేసినట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జూలైలో ఐఎస్ఎం తయారీ సూచీ 46.6కు దిగజారింది. దీంతో మాంద్యం భయాలు మళ్లీ నెలకొన్నాయని అంటున్నారు. అలాగే ఇజ్రాయెల్-హమాస్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలూ నష్టాలకు దారితీశాయని వారు చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాల నడుమ ఒక్కరోజే మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో కరిగిపోయింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.4,46,003.7 కోట్లు తగ్గి రూ.4,57,16,946.13 కోట్ల (5.46 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది. బీఎస్ఈ లార్జ్క్యాప్ 1.08 శాతం, మిడ్క్యాప్ 1.19 శాతం, స్మాల్క్యాప్ 0.58 శాతం చొప్పున పడిపోయాయి. ఉదయం ఆరంభం నుంచే సూచీలు నష్టాల్లో కదలాడగా.. సమయం గడుస్తున్నకొద్దీ మరింత తీవ్రంగా నేలచూపులు చూశాయి.