ముంబై, జూన్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆల్టైమ్ హైల్లో స్థిరపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ తొలిసారి 78వేల మార్కును దాటింది. 712.44 పాయింట్లు లేదా 0.92 శాతం ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా 78,053.52 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 823.63 పాయింట్లు అందిపుచ్చుకొని 78,164.71 స్థాయిని తాకింది. తద్వారా ఇంట్రా-డే హై రికార్డును నెలకొల్పింది. ఈ నెల 10న సెన్సెక్స్ మొదటిసారి 77వేల మార్కును అందుకున్న విషయం తెలిసిందే. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 183.45 పాయింట్లు లేదా 0.78 శాతం ఎగిసి గతంలో ఎన్నడూ లేనివిధంగా 23,721.30 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలోనూ సరికొత్త స్థాయిని చేరింది. 216.3 పాయింట్లు పెరిగి 23,754.15 వద్దకు వెళ్లింది.
ఇతర ఆసియా దేశాల మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల నడుమ మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లకు బ్లూచిప్ కంపెనీలు దన్నుగా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్సర్వ్ తదితర బడా సంస్థల షేర్ల కొనుగోళ్లకు మదుపరులు పోటీపడ్డారు. దీంతో సెన్సెక్స్ పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల మార్కును తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ల తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో సంస్థగా నిలిచింది. బీఎస్ఈలో 2.48 శాతం పెరిగి రూ.1,199.05 వద్ద ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ విలువ ఉన్నది. ఎన్ఎస్ఈలో 2.90 శాతం వృద్ధితో రూ.1,204గా ఉన్నది. ఇక బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలూ 0.26 శాతం, 0.03 శాతం చొప్పున పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా దేశాల్లో దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ఉన్నాయి. చైనా నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలు నష్టాల్లోనే కదలాడుతున్నాయి.
బ్యాంకింగ్ రంగ షేర్లు గరిష్ఠంగా 1.87 శాతం మేర పెరిగాయి. అలాగే ఆర్థిక సేవలు 1.45 శాతం, ఐటీ 0.53 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.28 శాతం, టెక్నాలజీ 0.43 శాతం చొప్పున బలపడ్డాయి. కానీ రియల్టీ, పవర్, యుటిలిటీస్, మెటల్, టెలికం షేర్లు 1.82 శాతం నుంచి 0.28 శాతం వరకు నష్టపోయాయి. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో కరెంట్ ఖాతా మిగులు 5.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దేశ జీడీపీలో ఇది 0.6 శాతానికి సమానం. ఇది సహజంగానే స్టాక్ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రూపాయిపై ఒత్తిళ్లను తగ్గించిందని, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులకూ మార్గాన్ని సుగమం చేసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధాన పెట్టుబడుల వ్యూహకర్త వీకే విజయకుమార్ అన్నారు. వడ్డీరేట్ల కోతలపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నుంచి స్పష్టత రాబోతున్నదన్న సంకేతాలూ కలిసొచ్చాయని ఆయన తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
తెలుగు రాష్ర్టాలకు చెందిన అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ కంపెనీ షేర్ల విలువ ఈ ఒక్కరోజే 19 శాతానికిపైగా పెరిగింది. సంస్థకు అనుబంధంగా ఉన్న అమర రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.. లిథియం-ఐయాన్ సెల్స్ టెక్నాలజీ కోసం జీఐబీ ఎనర్జీఎక్స్తో చేసుకున్న లైసెన్సింగ్ ఒప్పందం.. మదుపరుల్లో జోష్ను పెంచింది. షేర్ల కొనుగోళ్లకు పోటెత్తారు. దీంతో బీఎస్ఈలో 19.40 శాతం వృద్ధితో రూ.1,647 వద్ద షేర్ విలువ ముగిసింది. ఒకానొక దశలో 52 వారాల గరిష్ఠాన్ని తాకుతూ 19.99 శాతం ఎగిసి 1,655.20కు చేరింది. ఎన్ఎస్ఈలోనూ 19.56 శాతం లాభపడి రూ.1,650 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలో 19.99 శాతం ఎగబాకి 52 వారాల గరిష్ఠాన్ని చేరుతూ 1,656.05 వద్దకు వెళ్లింది.